యాసిడ్‌ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు.. రాష్ట్రాలకు సుప్రీం కీలక ఆదేశాలు

by Prasad Jukanti |

యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని, వీలుకాకుంటే భత్యం చెల్లించాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

యాసిడ్‌ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు.. రాష్ట్రాలకు సుప్రీం కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: యాసిడ్ దాడి బాధితుల (Acid Attack Survivors) పునరావాసం విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court of India) కీలక ఆదేశాలు ఇచ్చింది. బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు (Government Jobs) కల్పించాలని ఏ కారణం చేతనైనా ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం కాకపోతే వారికి జీవనాధారం కోసం భత్యం చెల్లించేలా విధి విధానాలు రూపొందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ విభాగాలు/ఏజెన్సీల్లో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేరో స్పష్టమైన కారణాలు తెలియజేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు సోమవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చీ లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆసిడ్ దాడి బాధితురాలు షేక్ మాలిక్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.

ప్రత్యామ్నాయ కేవైసీ:

షాహీన్ మాలిక్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టు అభ్యర్థన మేరకు ఉచితంగా (ప్రో బోనో) వాదనలు వినిపించారు. తన పిటిషన్‌లో షాహీన్ మాలిక్ యాసిడ్ దాడి బాధితులు బ్యాంక్ ఖాతాలు తెరవడం, ఆధార్ కార్డు పొందడం, ఆస్తుల నమోదు లేదా నవీకరణ చేయడం, మొబైల్ సిమ్ కార్డులు కొనుగోలు చేయడం వంటి విషయాల్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. యాసిడ్ దాడి బాధితుల కోసం KYC నమోదు ప్రక్రియలో ఉన్న సమస్యల గురించి కూడా కోర్టులో ప్రస్తావించారు. కేవైసీ ప్రక్రియలో కంటి గుడ్లను స్కాన్ చేయడం, కళ్లను మూయడం-తెరవడం (బ్లింకింగ్), వేలిముద్రలు ఇవ్వడం వంటి డిజిటల్ ధృవీకరణ విధానాలు ఉంటాయి. అయితే యాసిడ్ దాడి బాధితులకు ఈ ప్రక్రియలు చాలా సందర్భాల్లో సాధ్యం కాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో యాసిడ్ దాడి బాధితులకు అనుకూలంగా ప్రత్యామ్నాయ డిజిటల్ కేవైసీ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పలువురు బాధితులు ఇప్పటికే సుప్రీంకోర్టును కోరారు.

నిదింతుల ఆస్తుల జప్తు:

ఇదే కేసు విచారణ సందర్భంగా ఈ ఏడాది ప్రారంభంలో సుప్రీంకోర్టు యాసిడ్ దాడి కేసుల్లో మరింత కఠినమైన శిక్షలు అవసరమని కూడా వ్యాఖ్యానించింది. నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేసి బాధితులకు పరిహారం ఇవ్వాలని కోర్టు సూచించింది. ఇలాంటి నేరాలపై అసాధారణ చర్యలు అవసరం. శిక్ష కఠినంగా లేకపోతే ఇవి తగ్గవని నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకుని విక్రయించి బాధితులకు పరిహారం ఇవ్వకూడదా? అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.

Next Story