‘గెట్ అవుట్ ఫ్రమ్ హియర్’.. నడి రోడ్డుమీద మంత్రిని నిలదీసిన మహిళ

by Prasad Jukanti |   (  Updated:2026-04-22 06:47:55  IST  )

ముంబైలో రాజకీయ ర్యాలీ వల్ల ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌పై ఓ సామాన్య మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి గిరీష్ మహాజన్‌ను నిలదీసిన వైరల్ అవుతోంది.

‘గెట్ అవుట్ ఫ్రమ్ హియర్’.. నడి రోడ్డుమీద మంత్రిని నిలదీసిన మహిళ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలు, ర్యాలీల కోసం రోడ్లపై ట్రాఫిక్‍కు అంతరాయం కలిగించడం తరచూ చూస్తూనే ఉంటాం. ట్రాఫిక్ జామ్‍తో ఎంత ఇబ్బంది అవుతున్నా ఏమి అనలేక చాలా మంది మౌనంగా భరిస్తుంటారు. కానీ మహారాష్ట్రలో తీవ్రమైన ట్రాఫిక్ జామ్‍కు (Mumbai Traffic Jam) కారణం అయ్యారని ఓ సామాన్య మహిళ ఏకంగా మంత్రిని నడిరోడ్డుపై నిలదీసింది. మంత్రి అడ్డుకుని ఆమె చేసిన వాగ్వాదం ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

భారీగా ట్రాఫిక్ జామ్

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలే కారణం అని ఎన్డీయే కూటమి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మహరాష్ట్రలో నిన్న బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి కాంగ్రెస్, ఇతర విపక్షాల తీరుకు నిరసనగా జంబోరీ మైదాన్ ప్రాంతంలో నిరసన ర్యాలీ చేపట్టింది. అయితే సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ ర్యాలీ ఆలస్యం కావడంతో ఆ ప్రాంతమంతా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అయితే అదే సమయంలో తన బిడ్డను పాఠశాల నుండి ఇంటికి తీసుకురావడానికి వెళ్తున్న ఒక స్థానిక మహిళ ర్యాలీ కారణంగా గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది.

గెట్ అవుట్ ఫ్రమ్ హియర్:

ఓపిక నశించిన సదరు ఆమె తన వాహనం దిగి ర్యాలీలో పాల్గొంటున్న మంత్రి గిరీష్ మహాజన్ (Girish Mahajan) వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగింది. ర్యాలీల పేరుతో ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? పక్కనే ఖాళీ మైదానం ఉంది. అక్కడికి వెళ్లి నిరసన చేసుకోవచ్చు కదా? ఇక్కడ వందలాది మంది ప్రజలు వేచి చూస్తున్నారు. ఇక్కడి నుండి వెళ్ళిపోండి (Get out of here) అంటూ తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వారిపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరికి పోలీసులు ఆమెను పక్కకు తీసుకెళ్లి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Next Story