హేమంత్ సోరెన్‌పై ఈడీ కేసు.. కీలకంగా ఫ్రిజ్, టీవీ బిల్లులు

by Dishanational4 |
హేమంత్ సోరెన్‌పై ఈడీ కేసు.. కీలకంగా ఫ్రిజ్, టీవీ బిల్లులు
X

దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీట్‌లో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చివరకు రిఫ్రిజిరేటర్, స్మార్ట్ టీవీ కొనుగోలుకు సంబంధించిన బిల్లులను కూడా ఛార్జ్‌షీట్‌‌కు ఈడీ జతపరిచింది. ఈడీ ఛార్జ్ షీట్ ప్రకారం.. రాంచీలోని ప్రభుత్వ భూమిని నాటి హేమంత్ సోరెన్ సర్కారు 2010-11 సంవత్సరంలో కొందరు పేదలకు కేటాయించింది. అనంతరం వారిని ఆ స్థలం నుంచి పంపించి.. అక్కడ ఇంటిని కట్టించారు. ఆ ఇంట్లో హేమంత్ సోరెన్‌కు సన్నిహితుడైన సంతోష్ ముండా కుటుంబ సభ్యులను ఉంచారు. ఈ ఇంటి యజమానిగా హేమంత్ సోరెన్‌ మరో అనుచరుడు రాజ్‌కుమార్ పహాన్‌ను చూపించే ప్రయత్నం చేశారు. ఇక ఆ ఇంటి కరెంటు మీటరును హిలా రియాస్ కచ్చప్ పేరిట తీసుకున్నారు. ఆ ఇంటికి హేమంత్ సోరెన్ దంపతులు చాలాసార్లు వచ్చి వెళ్లారని స్వయంగా సంతోష్ ముండా ఈడీకి స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ‘‘రాంచీలో హేమంత్ సోరెన్ కబ్జా చేసిన స్థలంలోని ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్‌ను సంతోష్ ముండా కుమారుడి పేరిట 2017 ఫిబ్రవరిలో కొన్నారు. స్మార్ట్ టీవీని సంతోష్ ముండా కుమార్తె పేరిట 2022 నవంబర్‌లో కొన్నారు’’ అని ఛార్జ్ షీట్‌లో ఈడీ ప్రస్తావించింది. రాంచీలోని ఓ ఎలక్ట్రానిక్ ఉపకరణాల షోరూం నుంచి దీనికి సంబంధించిన బిల్లును సేకరించామని ఈడీ వెల్లడించింది.

Next Story