ఐదేళ్ల పాటు ఉచిత రేషన్..యూసీసీ అమలు: బీజేపీ మేనిఫెస్టోలో కీలక హామీలు

by Dishanational2 |
ఐదేళ్ల పాటు ఉచిత రేషన్..యూసీసీ అమలు: బీజేపీ మేనిఫెస్టోలో కీలక హామీలు
X

దిశ, నేషనల్ బ్యూరో: 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ తన మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేసింది. ‘సంకల్ప్ పత్ర’ పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోకు ‘మోడీ కీ గ్యారంటీ’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. దీనిని ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌లు రిలీజ్ చేశారు. వేదికపై అంబేద్కర్, రాజ్యాంగాల ప్రతిమలను ఉంచి మేనిఫెస్టోను ప్రకటించారు. పేదలు, యువకులు, రైతులు, మహిళలే లక్ష్యంగా మొత్తం 14అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చారు. ఇందులో ప్రధానంగా 75 ఏళ్లు పైబడిన వారందరినీ ఆయుష్మాన్ భారత్ యోజన పరిధిలోకి తీసుకురావడం, వచ్చే ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ కొనసాగింపు, ముద్ర యోజన రుణాల పరిమితిని రూ.10లక్షల నుంచి 20లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు.

అలాగే దేశ వ్యాప్తంగా మూడు కోట్ల ఇండ్లు నిర్మిస్తామని, ప్రతి ఇంటికీ పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ అందజేస్తామని తెలిపారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు. ట్రాన్స్ జెండర్లను సైతం ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. అంతేగాక సోలార్ పవర్ ద్వారా ఉచిత విద్యుత్ అందించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని తెలిపారు. యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ), వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ నియమించిన రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ మేనిఫెస్టోను తయారు చేసింది. దేశ వ్యాప్తంగా వచ్చిన 15లక్షల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని దీనిని రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది.

దేశం మొత్తం ఎదురు చూసింది: మోడీ

మేనిఫెస్టో రీలీజ్ అనంతరం మోడీ ప్రసంగించారు. బీజేపీ మేనిఫెస్టో కోసం దేశం మొత్తం ఎదురు చూసిందని తెలిపారు. మేనిఫెస్టోను రూపొందించిన రాజ్ నాథ్ సింగ్ బృందాన్ని అభినందించారు. గతంలో ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ అమలు చేసిందని గుర్తు చేశారు. సంకల్ప్ పత్ర అభివృద్ధి చెందిన భారత్‌లోని నాలుగు స్థంభాలకు(పేదలు, యువకులు, రైతులు, మహిళలు) శక్తినిస్తుందని చెప్పారు. అనేక మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా ఉద్యోగాలను సృష్టించబోతున్నామని , 21వ శతాబ్దపు భారతదేశ పునాదిని బీజేపీ బలోపేతం చేయబోతోందని అన్నారు. జల, వాయు మార్గాలను ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు. 5జీ నెట్ వర్క్‌ను అత్యంత వేగంగా విస్తరిస్తున్నామని తెలిపారు.

అంబేడ్కర్ ఆశయాలను బీజేపీ అనుసరిస్తోంది: నడ్డా

బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్ధేశించిన సామాజిక న్యాయం ఆశయాలను బీజేపీ అనుసరిస్తోందని పార్టీ చీఫ్ నడ్డా అన్నారు. ఆయన జయంతి సందర్భంగా మేనిఫెస్టోను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆర్టికల్ 370 రద్దు, మహిళా రిజర్వేషన్ చట్టం వంటివి గత పదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలని తెలిపారు. ప్రజల మద్దతు వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. గ్రామాలకు రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి విముక్తి చేయడం వంటివి గతంలో మోడీ నేతృత్వంలో చేశామని తెలిపారు. మరోవైపు దేశ పౌరులంతా బీజేపీ వైపే ఉన్నారని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. సంకల్ప్ పత్రలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed