డిజిటల్ యాడ్స్‌ కోసం కోట్లు కుమ్మరిస్తున్న పార్టీలు

by Dishanational1 |
డిజిటల్ యాడ్స్‌ కోసం కోట్లు కుమ్మరిస్తున్న పార్టీలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ, రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో వేగం పెంచాయి. ముఖ్యంగా కొత్త జనరేషన్ యువతను ఆకట్టుకొవడం కోసం, మారుతున్న టెక్నాలజీ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీలు డిజిటల్ పచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి. టెక్ దిగ్గజాలు మెటా, గూగుల్ గత మూడు నెలల్లో దేశీయంగా రాజకీయ పకటనల వ్యయం రూ. 102.7 కోట్లుగా అంచనా వేశాయి. ఇందులో కేంద్రంలో అధికార భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆన్‌లైన్ ప్రకటనల కోసమే రూ. 37 కోట్లకు పైగా ఖర్చు చేసింది. టెక్ దిగ్గజాల డేటా విశ్లేషణల ప్రకారం, ఈ మొత్తం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కంటే 300 రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఇండియా టుడేకు చెందిన ఓపెన్ సోర్స్ ఇంటిలిజెన్స్(ఓఎస్ఐఎన్‌టీ) టీమ్ విశ్లేషణ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ ఆన్‌లైన్ కంటెంట్ ప్రమోషన్ కోసం కేవలం రూ. 12.2 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారత్ జోడో న్యాయ్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 5 నుంచి ఈ ఏడాది మార్చి 3 వరకు మొత్తం ఖర్చులో ఫేస్‌బుక్ పోస్ట్‌లను ప్రమోట్ చేసేందుకు రూ. 5.7 లక్షలను కేటాయించినట్టు సమాచారం.

ఇతర పార్టీల సంగతి..

మిగిలిన పార్టీలకు సంబంధించి.. దేశంలోని రాజకీయ ప్రకటనల వ్యయాల జాబితాలో ఆంద్రప్రదేశ్‌కు చెందిన అధికార వై్ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా రూ. 4 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్(బీజేడీ) రూ. 51 లక్షలు, ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ రూ. 39.5 లక్షలు, మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), రూ. 27 లక్షలు ఖర్చు చేసింది. వై్ఎస్ఆర్‌సీపీ ఖర్చులో ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐ-ప్యాక్) ఖర్చులు కూడా ఉన్నాయి. ఇక, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జన్ సూరజ్ పార్టీ రూ. 2.5 లక్షల ఖర్చు చేసింది.

ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, జార్ఖండ్‌లోని అధికార జార్ఖండ్ మోర్చా, శివసేన వంటి అనేక పార్టీలు ఆన్‌లైన్ ప్రకటనల కోసం ఖర్చు చేయకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గూగుల్‌లో ప్రకటనలు వేస్తున్నప్పటికీ, డిసెంబర్ 5 నుంచి మార్చి 3 వరకు ఆన్‌లైన్ యాడ్స్ కోసం ఎలాంటి ఖర్చు చేయలేదు. రాజకీయ పరంగా డిజిటల్ విభాగంలో ఆధిపత్యం కలిగిన బీజేపీ తర్వాత ఎక్కువ ప్రచారంలో ఉన్న ఆప్ ఈ ఖర్చు విషయంలో దూరంగా ఉండటం అసాధారణంగా కనిపిస్తోంది.

పరోక్ష మార్గంలో..

అయితే, ప్రజా వ్యతిరేకతను దాటవేసేందుకు రాజకీయ పార్టీలు తరచుగా చేసే పని నేరుగా ప్రకనల కోసం ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండటం. బీజేపీ, వైఎస్ఆర్సీపీ, డీఎంకే, బీజేడీ వంటి అనేక పార్టీలు ఇతరులకు చెల్లించి తమ ప్రత్యక్ష ప్రమేయం లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నాయని డేటా విశ్లేషకులు చెబుతున్నారు. మెటా యాడ్ లైబ్రరీ నివేదిక ప్రకారం, పార్టీ కార్యక్రమాలు, అజెండాలను ప్రచారం చేసేందుకు, ప్రతిపక్ష పార్టీల నేతలపై వ్యతిరేక పోస్టులకు కనీసం ఏడు బీజేపీ మద్దతు పేజీలు రూ. 5.7 కోట్లు ఖర్చు చేశాయి. 'ఉల్టా చష్మా' అనే ఫేస్‌బుక్ పేజీ ఒక్కటే రూ. 3.2 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. ఇదే పేజ్ ఇతర మీమ్ ఎక్స్‌ప్రెస్, పొలిటికల్ ఎక్స్‌రే, తమిళకం, మలబార్ సెంట్రల్ లాంటి ఇతర పేజీలకు కూడా నిధులు సమకూరుస్తోంది.

డీఎంకే కోసం, పార్టీ అధినేత ఎంకె స్టాలిన్‌ను పొగిడేందుకు, ప్రధాని మోడీని విమర్శించే యూట్యూబ్ వీడియోల రీచ్ పెంచేందుకు పాపులస్ ఎంపవర్‌మెంట్, సింపుల్‌సెన్స్ అనలిటిక్స్ అనే రెండు సంస్థలు గూగుల్‌కు వరుసగా రూ. 86.6 లక్షలు, రూ. 23.9 లక్షలు ఖర్చు చేశాయి.

ఇక, తెలుగు పార్టీ అధికార వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డికి అనుకూలంగా కంటెంట్ ప్రచారం కోసం కనీసం ఐదు పేజీలు ఈ మూడు నెలల కాలంలో రూ. 1.12 కోట్లు ఖర్చు చేశాయి. బెంగళూరుకు చెందిన జాయ్ ఆఫ్ గివింగ్ గ్లోబల్ ఫౌండేషన్ ప్రశాంత్ కిషోర్ ప్రసంగాల వీడియోల కోసం రూ. 9.5 లక్షలు ఖర్చు చేసింది.

రాజకీయ ప్రకటనల పార్టీలు ఇప్పుడు ఫేస్‌బుక్, యూట్యూబ్, గూగుల్‌కే పరిమితం అవ్వట్లేదు. ఈసారి ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిలోనూ ఎక్కువ దృష్టి పెట్టాయి. ఈ ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 28 మధ్య బీజేపీకి చెందిన 356 ప్రకటనల్లో 190 ఇన్‌స్టాగ్రామ్‌లోనే వచ్చాయి. కాంగ్రెస్ ఫిబ్రవరి 10 నుంచి మార్చి 3 మధ్య 71 ప్రకటనలను ఇన్‌స్టాలో ప్రచారం చేసింది.


Next Story

Most Viewed