లోక్‌సభలో మోడీ సర్కారు శ్వేతపత్రం.. టార్గెట్ ‘యూపీఏ’

by Dishanational4 |
లోక్‌సభలో మోడీ సర్కారు శ్వేతపత్రం.. టార్గెట్ ‘యూపీఏ’
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో శ్వేతపత్రం సమర్పించారు. ఇందులో ప్రధానంగా యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) హయాంలో జరిగిన ఆర్థిక దుర్వినియోగానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. మునుపటి యూపీఏ పాలనను, గత పదేళ్ల మోడీ పాలనతో పోలుస్తూ శ్వేతపత్రంలో వివరాలను పొందుపరిచారు. నిర్మలా సీతారామన్ ఇంగ్లీషు, హిందీ భాషల్లో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థకు మహర్దశను తీసుకొచ్చేందుకు, దేశ ప్రతిష్ఠను పెంచేందుకు, ప్రజల మనస్సులలో ఆశను చిగురింపజేయడానికి ఎన్‌డీఏ సర్కారు తీసుకున్న చర్యల వివరాలను ఇందులో ప్రస్తావించారు.

వాజ్‌పేయి నేతృత్వంలో..

అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు 2004లో అధిక వృద్ధి సామర్థ్యంతో కూడిన ఆరోగ్యకరమైన, స్థితిస్థాపక ఆర్థిక వ్యవస్థను అందించినప్పటికీ.. ఆ తర్వాత అధికార పీఠమెక్కిన యూపీఏ ప్రభుత్వం పాలనలో విఫలమైందని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. యూపీఏ హయాంలో ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరిందని, అధిక రుణాలు మంజూరు చేయడంతో బ్యాంకింగ్ రంగం బలహీనపడిందని ఆరోపించారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో కూడిన సంకీర్ణ సర్కారు ఆనాడు తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల వల్లే దేశంలో వ్యాపార వాతావరణం దెబ్బతిన్నదని వైట్ పేపర్‌లో తెలిపారు. 2004 నుంచి 2013 సంవత్సరాల మధ్యకాలంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, కుంభకోణాలు పెద్దఎత్తున చోటుచేసుకున్నాయని శ్వేతపత్రంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. ఈ స్కాంల వల్ల దేశ ఖజానా గుల్లబారిందన్నారు. ఈనేపథ్యంలో 2014 నుంచి ఆర్థిక వ్యవస్థను రిపేర్ చేసేందుకు మోడీ సర్కారు ఎంతో శ్రమించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

బ్యాంకులను కొల్లగొట్టిన వాళ్లతో ఎన్డీఏకు లింకేంటి ? : అధిర్

కేంద్రం విడుదల చేసిన శ్వేతపత్రంతో తమకేం సమస్య లేదని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి అన్నారు. “మెహుల్ చోక్సీ పేపర్లను కూడా సభకు తీసుకురావాలి. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో బ్యాంకులను ఎందుకు లూటీ చేస్తున్నారు? బ్యాంకులను కొల్లగొట్టి విదేశాలకు పారిపోయే వారితో వీరికి సంబంధం ఏమిటి?’’ అని ఆయన ప్రశ్నించారు.



Next Story

Most Viewed