ఎన్‌సీడబ్ల్యూ మెంబర్‌గా సినీ నటి ఖుష్బూ.. ఉత్తర్వులు జారీ

by Disha Web Desk 12 |
ఎన్‌సీడబ్ల్యూ మెంబర్‌గా సినీ నటి ఖుష్బూ.. ఉత్తర్వులు జారీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా వ్యవహరిస్తున్న సినీ నటి ఖుష్బూ సుందర్‌కి కీలక పదవి దక్కింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్న ఖుష్బు సుందర్‌కు ఇప్పుడు చట్టబద్ధమైన పదవి లభించింది.

ఖుష్బూతో పాటు ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న సీనియర్ సినీ ఆర్టిస్ట్ మమతా కుమారి, డెలీనా ఖోంగ్‌డుప్‌లు కూడా జాతీయ మహిళా కమిషన్ సభ్యులుగా నామినేట్ అయ్యారు. ఇందులో వారి పదవి కాలం మూడేళ్లు ఉంటుందని కేంద్రం పేర్కొంది. ఖుష్బూకి ఎన్‌సీడబ్ల్యూ మెంబర్‌గా పదవి దక్కడంపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు.

‘జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన ఖుష్బూకి బీజేపీ తరఫున అభినందనలు. ఇది ఆమె పట్టుదలకు, మహిళల హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి దక్కిన గుర్తింపు’ అని ఆయన ట్వీట్ చేశారు. అలాగే పలువురు బీజేపీ నేతలు, పలువురు సినీ ప్రముఖులు ఖుష్బూకి అభినందనలు తెలుపుతున్నారు. మరోవైపు కేంద్రం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించడంపై ఖుష్బూ స్పందించారు.

తనకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నాయకత్వంలో నారీ శక్తిని పరిరక్షించడానికి, సంరక్షించడానికి, పోషించడానికి తాను తీవ్రంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. కాగా, సినీ పరిశ్రమలో 100కు పైగా సినిమాల్లో నటించిన ఖుష్బు మొదట డీఎంకే, కాంగ్రెస్ పార్టీలలో పదవులు నిర్వహించి, ఆ తర్వాత బీజేపీలో చేరి ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.



Next Story

Most Viewed