పుల్వామా ఎటాక్ మాస్టర్ మైండ్ భార్యతో టచ్‌లో ఉన్న ఫరీదాబాద్ డాక్టర్ !

by Phanindra |

పుల్వామా దాడి మాస్టర్ మైండ్ భార్యతో ఫరీదాబాద్ డాక్టర్ షహీద్ సయీద్ టచ్‌లో ఉన్నట్లు తేలింది. జైషే వుమెన్ వింగ్ బాధ్యతలు ఆమెకు అప్పగించారట.

పుల్వామా ఎటాక్ మాస్టర్ మైండ్ భార్యతో టచ్‌లో ఉన్న ఫరీదాబాద్ డాక్టర్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ బాంబు పేలుడులో జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రసంస్థ లింకులను దర్యాప్తు చేస్తున్న అధికారులకు షాకింగ్ విషయం తెలిసింది. ఫరీదాబాద్‌లో భారీగా పేలుడు పదార్థాలు దొరికిన సమయంలో అరెస్టయిన డాక్టర్ షహీన్ సయీద్‌కు పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ ఉమర్ ఫరూఖ్ భార్యతో సంబంధాలున్నట్లు వెల్లడైంది. జైష్ చీఫ్ మసూద్ అజహర్ నెఫ్యూ అయిన ఉమర్.. 2019లో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను బలిగొన్న పుల్వామా దాడికి ప్లాన్ చేసిన వాడు. ఆ తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో అతన్ని హతమార్చారు. ఇప్పుడు ఉమర్ భార్య అయిన అఫీరా బీబీతో ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీలో పనిచేసిన డాక్టర్ షహీన్ సయీద్‌కు సంబంధాలుండటం సంచలనంగా మారింది.

ఆపరేషన్ సిందూర్‌లో భారీగా నష్టపోయిన తర్వాత మహిళలతో ప్రత్యేకంగా జమాత్-ఉల్-మొమినత్ అనే విభాగాన్ని జైష్-ఎ-మహమ్మద్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విభాగంలో కీలక బాధ్యతలు చేపట్టిన అఫీరా.. ఈ బ్రిగేడ్‌లో సలహా మండలి ‘షురా’లో కూడా చేరినట్లు తెలుస్తోంది. మసూద్ అజహర్ సోదరి సాదియా అజహర్‌తో కలిసి అఫీరా పనిచేస్తోంది. వీళ్లిద్దరూ కూడా డాక్టర్ షహీన్ సయీద్‌తో టచ్‌లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అల్-ఫలా యూనివర్సిటీలో సీనియర్ డాక్టర్‌గా ఉన్న షహీన్ సయీద్ కారులో అసాల్ట్ రైఫిల్స్, ఇతర మందుగుండి సామగ్రి దొరకడంతో ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో జమాత్-ఉల్-మొమినత్ విభాగాన్ని ప్రారంభించి, ఉగ్రవాద చర్యల కోసం ర్యాడికలైజ్డ్ మహిళలను రిక్రూట్ చేసుకునే బాధ్యతను సయీద్‌కు అప్పగించినట్లు విచారణలో తేలింది.

Next Story