ఫ్యామిలీ పాలిటిక్స్.. ఎంపీ ఎన్నికల్లో వదిన మరదలి మధ్య ఫైట్

by Disha Web Desk 13 |
ఫ్యామిలీ పాలిటిక్స్.. ఎంపీ ఎన్నికల్లో వదిన మరదలి మధ్య ఫైట్
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పోటీ కోసం నేతలు ప్రయత్నాలు చేస్తుంటే అవసరమైతే విజయం కోసం తన పర బేధం లేకుండా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఫ్యామిలీ పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి. నిన్నటి వరకు అబ్బాయ్ వర్సెస్ బాబాయ్ అనేలా ఉన్న అజిత్ పవార్, శరత్ పవార్ మధ్య రాజకీయ వైరం తాజాగా వదినా మరదలిగా టర్న్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవార్ కుటుంబానికి కంచు కోటగా ఉన్న బారామతి లోక్ సభ స్థానంలో ఈసారి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆమె పేరుతో ఓ ప్రచారం వాహనం బారామతిలో చక్కర్లు సైతం కొడుతోంది. ఈ నేపథ్యంలో శరద్ పవార్ తో ఏర్పడిన రాజకీయ వైరం కారణంగా అజిత్ పవార్ ఈసారి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి.

వదిన వర్సెస్ మరదలు:

ఇటీవల ఎన్సీపీ రెండుగా చీలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్సీపీ పార్టీ పేరు, ఎన్నికల గుర్తును మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గానికి కేటాయిస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. అయితే బాబాయ్ తో విభేదించి బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన అజిత్ పవార్ తాజాగా బాబాయ్ పై జోరు పెంచినట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో బారామతి నుంచి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో జాతీయ మీడియా పలు కథనాలు వెలువడగా ఈ అశం ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాగా ప్రస్తుతం ఈ స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో మరదలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోటే వదిన పోటీకి సై అంటుండటంతో మరాఠ పాలిటిక్స్ లో మరో సంచలనంగా మారింది.

పవర్ కుటుంబానిదే ఆధిపత్యం:

బారామతి లోక్ సభ స్థానంలో పవార్ కుటుంబానిదే ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. ఇక్కడ 1967,1972, 1978, 1980, 1985, 1990 అసెంబ్లీ ఎన్నిక్లలో శరద్ పవార్ బారామతి స్థానం నుంచి ఎన్నికయ్యారు. 2009 నుంచి గత మూడు దఫాలుగా ఆయన కుమార్తే సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి ఫ్యామిలీలో చెలరేగిన రాజకీయ తుఫాను కారణంగా ఇక్కడి నుంచి తన సతీమణిని పోటీకి దింపేందుకు అజిత్ పవార్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ప్రజల తీర్పు ఎలా ఉండబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది.


Next Story