Pak: ప్రతి నీటి చుక్కా మాదే.. సింధూ జలాలపై పాక్ సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |

“సింధూ నదీ జలాల్లో ప్రతి నీటి చుక్కా మాదే” అని పాకిస్థాన్(Pakistan) మంత్రి అయిస్ లెఘారీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pak: ప్రతి నీటి చుక్కా మాదే.. సింధూ జలాలపై పాక్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: “సింధూ నదీ జలాల్లో ప్రతి నీటి చుక్కా మాదే” అని పాకిస్థాన్(Pakistan) మంత్రి అయిస్ లెఘారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘సింధూ నదీ జలాల ఒప్పందం(Indus Water treaty) అమలును నిలిపివేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయం పిరికిపంద, చట్టవిరుద్ధమైన చర్య. ఈ జలాల్లోని ప్రతి నీటి చుక్కా మాదే. ఈ హక్కును మేం చట్టపరంగా, రాజకీయంగా, అంతర్జాతీయంగా పూర్తిశక్తితో కాపాడుకుంటాం. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిగా ఉన్న ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగే అవకాశం లేదు. ఈ చర్యతో నీటి యుద్ధానికి తెరతీస్తున్నారు’’ అని పాకిస్థాన్‌ మంత్రి అవాయిస్‌ లెఘారీ ఓ పోస్ట్‌లో రాసుకొచ్చారు. పెహల్గాం ఉగ్రదాడి(Pahalgam terror attack) తర్వాత పాక్ పై భారత్ ఆంక్షలు విధించింది. సీమాంతర ఉగ్రవాదానికి ముప్పు పలికే వరకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని వెంటనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపైనే పాక్ స్పందించింది.

ఆ తీర్పులు భారత్ కు వర్తించదు

మరోవైపు, అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన వియన్నా ఒప్పందంపై భారత్‌ సంతకం చేయలేదు. అయితే, ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్నైనా రద్దుచేసుకునే హక్కు భారత్‌కు ఉంటుంది. కాబట్టి పాక్‌ ఏ కోర్టుకు వెళ్లినా, అంతర్జాతీయ సంస్థకు వెళ్లినా భారత్ కు ఎలాంటి సమస్య ఉండదు. అంతర్జాతీయ సంస్థలు, కోర్టులు తీర్పు ఇచ్చినా భారత్‌కు వర్తించదు. మరోవైపు, భారత్‌ తీసుకున్న నిర్ణయాలపై చర్చించేందుకు పాక్‌ గురువారం కీలక సమావేశం నిర్వహించింది. ఇస్లామాబాద్‌లో ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో పాక్‌ సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు, మంత్రులు, భద్రతా కమిటీ సభ్యులు, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. భారత నిర్ణయాలకు వ్యతిరేకంగా పాక్‌ విదేశాంగ శాఖ చేసిన ప్రతిపాదనలను ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

Next Story