గణతంత్ర వేడుకల్లో మెరిసిన ఈయూ కమిషన్ చీఫ్ ఉర్సులా.. ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

భారత 77 వ గణతంత్ర వేడుకల్లో యూరప్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

గణతంత్ర వేడుకల్లో మెరిసిన ఈయూ కమిషన్ చీఫ్ ఉర్సులా.. ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : భారత 77 వ గణతంత్ర వేడుకల్లో యూరప్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె, భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదిక ఎక్స్ వేదికగా ఆమె పంచుకున్న భావాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

హిందీలో ధన్యవాదాలు..

తమకు సాదర స్వాగతం పలికిన భారత రాష్ట్రపతికి ఉర్సులా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ట్వీట్‌లో హిందీని ఉపయోగించడం విశేషం. "స్నేహపూర్వక స్వాగతానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు" (स्नेहपूर्ण स्वागत के लिए आपका हार्दिक धन्यवाद) అంటూ ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, యూరప్ సమాఖ్య కలిసి పనిచేయడం ద్వారా కొత్త అంతర్జాతీయ క్రమాన్ని (New Global Order) రూపొందించవచ్చని ఆమె ఆకాంక్షించారు.

రక్షణ రంగంలో కీలక ముందడుగు

గణతంత్ర వేడుకల పరేడ్‌లో యూరోపియన్ యూనియన్ (EU) జెండాలతో పాటు, ఈయూ మిలిటరీ స్టాఫ్, మారిటైమ్ మిషన్లయిన ‘అట్లాంటా’ (ATALANTA), ‘ఆస్పైడ్స్’ (ASPIDES) జెండాలను ప్రదర్శించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత్-ఈయూ మధ్య పెరుగుతున్న రక్షణ సహకారానికి శక్తివంతమైన చిహ్నమని ఆమె అభివర్ణించారు. రేపు సంతకం కానున్న ‘సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్టనర్‌షిప్’ ఈ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో.. ‘భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేయడం జీవితకాల గౌరవంగా భావిస్తున్నాను. భారత్ సాధించే విజయం ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సుసంపన్నంగా, సురక్షితంగా ఉంచుతుంది’అని ఉర్సులా వాన్ డెర్ లెయెన్ పేర్కొన్నారు.

Next Story