ముడా స్కామ్‌లో ఈడీ దూకుడు.. ఏకంగా రూ.100 కోట్ల ఆస్తులు సీజ్

by Kema Shiva Kumar |

కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరింత దూకుడు పెంచింది.

ముడా స్కామ్‌లో ఈడీ దూకుడు.. ఏకంగా రూ.100 కోట్ల ఆస్తులు సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో తాజాగా బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్ల విలువ చేసే మొత్తం 92 ఆస్తులను అధికారులు సీజ్ చేశారు. అయితే, ఆ ఆస్తులు హౌసింగ్ కో-ఆపరేటివ్ సొసైటీతో పాటు MUDA అధికారుల బినామీల పేరుతో ఉన్నట్లుగా ఈడీ ఆధారాలతో సహా గుర్తించింది. దీంతో అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA)-2002 కింద ఆస్తులను జప్తు చేసింది.

ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం రూ.400 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అందులో రూ.300 కోట్ల విలువైన 160 MUDAకు చెందిన స్థలాలు కూడా ఉన్నాయి. మైసూరు లోకాయుక్త (Lokayuktha) పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ తన దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. దీంతో కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah)తో పాటు ఆయన సతీమణి బీఎం పార్వతమ్మ, బావమరిది మల్లికార్జున స్వామి, మరో వ్యక్తి దేవరాజులకు ఉచ్చు బిగుస్తోంది.

ఈడీ దర్యాప్తులో భాగంగా MUDA స్థలాల కేటాయింపులలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లుగా వెల్లడైంది. కేసులో మాజీ MUDA కమిషనర్ జీ.టి దినేష్ కుమార్‌తో పాటు ఇతర అధికారులు ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఈడీ ఆరోపించింది. ప్లాట్ల అక్రమ కేటాయింపులకు గాను నిందితులకు లంచాలు, నగదు చెల్లింపులు, బ్యాంక్ బదిలీలు ఆస్తుల రూపంలో కమీషన్లు ముట్టినట్లుగా బట్టబయలైంది. వచ్చిన డబ్బు కో-ఆపరేటివ్ సొసైటీ, MUDA అధికారుల సంబంధీకులు, సహచరుల బ్యాంక్ ఖాతాల ద్వారా మళ్లించినట్లుగా సాక్ష్యాధారాలు కూడా లభ్యమయ్యాయి.

Next Story