రాజ్యాంగంతో రాజకీయాలు చేస్తున్నారు: కాంగ్రెస్, ఆర్జేడీలపై ప్రధాని మోడీ ఫైర్

by Dishanational2 |
రాజ్యాంగంతో రాజకీయాలు చేస్తున్నారు: కాంగ్రెస్, ఆర్జేడీలపై ప్రధాని మోడీ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. బీజేపీ దేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తుంటే విపక్ష కూటమి నేతలు దానిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దేశంలోని రాజ్యాంగ వ్యతిరేకులను శిక్షించేదుకు ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. బిహార్‌లోని గయా జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) సహా ఇతర ప్రతిపక్ష నాయకులు రాజ్యాంగంతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తనను బలహీనపర్చడానికే రాజ్యాంగం పేరుతో అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. ఎన్డీయే రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని, దానిని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు.

ఆర్జేడీ బిహార్‌కు ఎంతో ద్రోహం చేసిందని ఆరోపించారు. జంగిల్ రాజ్, అవినీతి అనే రెండు విషయాలను మాత్రమే ఆర్జేడీ రాష్ట్రానికి ఇచ్చిందని విమర్శించారు. ఆర్జేడీ హయాంలో రాష్ట్రంలో అవినీతి అభివృద్ధి చెందిందని తెలిపారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌లు సామాజిక న్యాయం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ఇండియా కూటమికి ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. కాగా, బిహార్ మాజీ సీఎం, హిందుస్థాన్ అవామీ మోర్చా (హెచ్‌ఏఎం) వ్యవస్థాపకుడు జితన్ రామ్ మాంఝీ గయా నుంచి పోటీ చేస్తున్నారు.


Next Story