కుక్క తినని బిస్కట్లు కార్యకర్తకు ఇచ్చిన రాహుల్​? వీడియో వైరల్​..

by Dishanational1 |
కుక్క తినని బిస్కట్లు కార్యకర్తకు ఇచ్చిన రాహుల్​? వీడియో వైరల్​..
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం జార్ఖండ్‌లో కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఓ కుక్కకు బిస్కెట్లు తినిపించిన సంఘటన పెద్ద దుమారం రేపుతోంది. రాహుల్ గాంధీ వద్దకు ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను తీసుకువచ్చాడు. ఆ కుక్కకు రాహుల్ గాంధీ బిస్కెట్ తినిపించే ప్రయత్నం చేయగా, అది నిరాకరించింది. అయితే, రాహుల్ గాంధీ ఆ బిస్కెట్‌ను కుక్క యజమానికి ఇచ్చాడు. ఇప్పుడు ఈ సంఘటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనను బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శ చేశారు. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ, కుక్క నిరాకరించడంతో దాని యజమానికి ఆ బిస్కెట్ అందించాను, అది తప్పా అంటూ ప్రశ్నించారు. వీడియో వైరల్ కావడం, బీజేపీ నేతల విమర్శలపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కను తన చేతుల్లోకి తీసుకున్న సమయంలో అది భయపడిందని, బిస్కెట్ తినేందుకు నిరాకరించింది. వెంటనే దాని యజమానిని పిలిచి, కుక్కతో పాటు బిస్కెట్ ఇచ్చానని చెప్పారు. అతను ఇచ్చిన తర్వాత కుక్క బిస్కెట్ తిన్నదని, ఇందులో సమస్యేముందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

బీజేపీ నేత అమిత్ మాలవీయ ట్విటర్‌లో షేర్‌ చేసిన వీడియోలో రాహుల్ గాంధీ కుక్కకు బిస్కెట్లు తినిపిస్తున్నట్టు ఉన్న వీడియోలో, కుక్క బిస్కెట్‌ను నిరాకరించడం, దాన్ని కుక్క యజమానికి ఇవ్వడం మాత్రమే ఉంది. ఆ తర్వాత జరిగిందేంటో చూపించలేదు. ఇది కాస్త వైరల్ కావడంతో బీజేపీ నేతలు విమర్శలు మొదలుపెట్టారు. రాహుల్ గాంధీ తన మద్దతుదారులను అవమానించారని, ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె పార్టీ కార్యకర్తలను కుక్కలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలను, ఈ సంఘటనను కలిపి చర్చకు పెట్టారు. ఈ వ్యవహారంపై స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, రాహుల్ గాంధీ మాత్రమే కాదు, వారి కుటుంబం వేసే బిస్కెట్ తనకు కూడా తినిపించాలని చూశారని, అందుకు తాను నిరాకరించి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు.


Next Story