నిరుద్యోగులకు 'దీదీ' భరోసా: పదో తరగతి పాసై ఉద్యోగం లేనివారికి నెలకు రూ. 1500 భృతి

by Ramesh Naini |

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల వేళ నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పదో తరగతి ఉత్తీర్ణులై, ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న వారికి నెలకు రూ. 1,500 నిరుద్యోగ భృతిని అందజేయనున్నట్లు వెల్లడించారు.

నిరుద్యోగులకు దీదీ భరోసా: పదో తరగతి పాసై ఉద్యోగం లేనివారికి నెలకు రూ. 1500 భృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటర్లను ఆకట్టుకునేలా భారీ పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు నెలకు రూ. 1,500 ఆర్థిక సాయం అందించనున్నట్లు శనివారం వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ఒక రోజు ముందుగానే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు.

నిరుద్యోగ భృతికి అర్హతలు..

కనీసం పదో తరగతి (Secondary Examination) ఉత్తీర్ణులై ఉండాలి. 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువతీ యువకులు ఇందుకు అర్హులు. వాస్తవానికి ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలు కావాల్సి ఉండగా, సీఎం నిర్ణయంతో నేటి నుంచే (మార్చి 7) లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కానుంది. స్కాలర్‌షిప్‌లు మినహా మరే ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందని వారు దీనికి అర్హులు. ఇప్పటివరకు దాదాపు ఒక కోటి మంది యువత ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

నిరుద్యోగం 40 శాతం తగ్గుముఖం..

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బెంగాల్‌లో నిరుద్యోగ రేటు గతంతో పోలిస్తే 40 శాతం తగ్గిందని స్పష్టం చేశారు. ‘మేము ఇప్పటివరకు 40 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చాం. అందులో 10 లక్షల మందికి ఇప్పటికే ఉపాధి లభించింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి ఐటీ, జూట్, లెదర్ రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నాం’ అని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల వేళ మమతా బెనర్జీ ప్రకటించిన ఈ 'నిరుద్యోగ భృతి' యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని టీఎంసీ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story