ఢిల్లీ సర్కారు అధికారాల కట్టడికి రేపు పార్లమెంటులోకి ఆర్డినెన్స్!

by Disha Web Desk 17 |
ఢిల్లీ సర్కారు అధికారాల కట్టడికి రేపు పార్లమెంటులోకి ఆర్డినెన్స్!
X

న్యూఢిల్లీ: ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర సర్కారు జారీ చేసిన ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లు పార్లమెంటు ముందుకు రానుంది. దీన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో మంగళవారం ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ పరిధిలోని చాలా సేవలపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణను పెంచేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును "గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు-2023" అని పిలుస్తారు. ఈ బిల్లుపై లోక్ సభ, రాజ్యసభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం జరిగే అవకాశం ఉంది.

"ఢిల్లీ ఆర్డినెన్స్" బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని "ఇండియా" కూటమిలో ఉన్న పార్టీలన్నీ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ఎంపీలు జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు బిల్లుపై ఓటింగ్ పూర్తయ్యే వరకు సభకు హాజరు కావాలని నిర్దేశించింది. ఇక ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం లోక్‌సభ ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇచ్చారు. ఈ బిల్లు రాజ్యాంగంలోని ఫెడరలిజం సూత్రాన్ని ఉల్లంఘించేలా ఉందన్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని, తమ రాజ్యసభ ఎంపీలందరికీ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సోమవారం విప్ జారీ చేసింది.

బిల్లులో పలు సవరణలు..

ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేసే ఉన్నతాధికారులకు బదిలీల అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతులలోకి వెళ్తాయి. అయితే తాజాగా "ఢిల్లీ ఆర్డినెన్స్" బిల్లులో పలు మార్పులు చేశారు. అందులోని "సెక్షన్ 3ఏ", "సెక్షన్ 45డి"లో కేంద్ర సర్కారు సవరణలు చేసింది. కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌లోని "సెక్షన్ 3ఏ" ని బిల్లు నుంచి పూర్తిగా తొలగించారు. "సెక్షన్ 3ఏ" అనేది రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లోని జాబితా-2లో ఉన్న ఎంట్రీ 41కి సంబంధించినది.

ఢిల్లీ పబ్లిక్ సర్వీస్‌లకు సంబంధించిన చట్టాలను రూపొందించే హక్కు ఢిల్లీ అసెంబ్లీకి లేదని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. కానీ ప్రతిపాదిత బిల్లులో.. ఆర్డినెన్స్‌లోని సెక్షన్ 45డి కింద ఉన్న నిబంధనలను సరళీకృతం చేశారు. సెక్షన్ 45డీ అనేది వివిధ ప్రభుత్వ మండళ్లు, కమీషన్లు, అధికారులు, చట్టబద్ధమైన సంస్థల నియామకాలతో ముడిపడినది.


Next Story