ఆ ఇద్దరి ప్రమేయంపై ఆధారాల్లేవ్.. ఢిల్లీ హైకోర్టు

by Dishafeatures2 |
ఆ ఇద్దరి ప్రమేయంపై ఆధారాల్లేవ్.. ఢిల్లీ హైకోర్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రాజేశ్‌జోషి, గౌతమ్ మల్హోత్రా బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వారిద్దరికీ బెయిల్ ఇవ్వొద్దని పేర్కొన్న ఈడీ విచారణ సందర్భంగా వాదనలు వినిపించడంలో, వారి ప్రమేయం ఉందని ధృవీకరించే ఆధారాలను చూపించడంలో విఫలమైనట్లు స్పెషల్ జడ్జి ఎంకే నాగ్‌పాల్ వ్యాఖ్యానించారు. సౌత్ గ్రూపు ద్వారా రూ. 100 కోట్లను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కిక్‌బ్యాక్ రూపంలో ముట్టినట్లు ఈడీ లేవనెత్తిన ఆరోపణలను ధృవీకరించేలా ఎలాంటి ఎవిడెన్సులను చూపించలేకపోయిందన్నారు. నాలుగు రోజుల క్రితం జరిగిన వాదనలు, స్పెషల్ జడ్జి మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్ కాపీ సోమవారం బైటకు రావడంతో పై అంశాలు వెలుగులోకి వచ్చాయి.

అప్రూవర్‌గా మారిన దినేష్ అరోరా ఇచ్చిన ఓరల్ స్టేట్‌మెంట్ ఆధారంగా వీరిద్దరికీ ఈ స్కామ్‌లో సంబంధం ఉందన్న నిర్ధారణకు రాలేమని స్పెషల్ జడ్జి స్పష్టం చేశారు. మొత్తం కేసు విషయంలో వీరి ప్రమేయం ఉండొచ్చేమోగానీ.. బెయిల్ నిరాకరించడానికి ఈడీ లేవనెత్తిన రూ. 100 కోట్ల కిక్‌బ్యాక్, ఎక్సయిజ్ పాలసీ రూపకల్పనలో ప్రమేయం తదితరాలతో ఏకీభవించలేమని పేర్కొన్నారు. బెయిల్ మంజూరు చేస్తూనే కొన్ని షరతులను విధించిన స్పెషల్ జడ్జీ.. దేశం విడిచి వెళ్ళరాదని, వెళ్ళాల్సి వస్తే స్పెషల్ కోర్టు పర్మిషన్ తీసుకోవాలని స్పష్టం చేశారు. దర్యాప్తు అధికారి పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని, సాక్ష్యాలను తారుమారు చేయరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని, డిజిటల్ ఆధారలను ధ్వంసం చేయరాదని.. తదితర షరతులు విధించారు.

శరత్‌చంద్రారెడ్డికి బెయిల్

అరబిందో ఫార్మా ఫుల్ టైమ్ డైరెక్టర్ శరత్‌ చంద్రారెడ్డికి ఇంతకాలం రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా, గతంలో ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ అనంతరం సోమవారం రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. గత కొంతకాలం తన భార్య అనారోగ్య అవసరాల నిమిత్తం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని స్పెషల్ కోర్టుకు చేసిన విజ్ఞప్తి తర్వాత ఈడీ అభిప్రాయాన్ని తెలుసుకున్న జడ్జి ఎంకే నాగ్‌పాల్ ఇంటెరిమ్ బెయిల్ జారీచేశారు. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో గత విచారణ సందర్భంగా ఈడీకి జారీ చేసిన నోటీసులు, వాటికి వచ్చిన రిప్లై చూసిన తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.

Next Story