Rahul Gandhi: చెప్పాపెట్టకుండా విదేశాలకు వెళ్తున్నారు.. రాహుల్ గాంధీపై సీఆర్పీఎఫ్ ఆరోపణలు

by Prasad Jukanti |   (  Updated:2025-09-11 13:18:27  IST  )

రాహుల్ గాంధీ భద్రతా ప్రోటోకాల్ పాటించడంలేదని సీఆర్పీఎఫ్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

Rahul Gandhi: చెప్పాపెట్టకుండా విదేశాలకు వెళ్తున్నారు.. రాహుల్ గాంధీపై సీఆర్పీఎఫ్ ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) భద్రతపై సీఆర్పీఎఫ్ (CRPF) మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. రాహుల్ గాంధీ భద్రతా ప్రోటోకాల్ (Security Protocol) పాటించడం లేదని, మాకు సమాచారం ఇవ్వకుండానే ఆయన విదేశాలకు వెళ్లిపోతున్నారంటూ ఆరోపించింది. ఈ మేరకు సీఆర్పీఎఫ్ వీవీఐపీ సెక్యూరిటీ చీఫ్ సునీల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీకి తాజాగా లేఖ రాశారు. ముఖ్యంగా సీఆర్పీఎఫ్ ఎల్లో బుక్ లో పేర్కొన్న ప్రోటోకాల్ లను ఆయన ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. ఇటలీ (డిసెంబర్ 30 నుండి జనవరి 9 వరకు), వియత్నాం (మార్చి 12 నుండి 17 వరకు), దుబాయ్ (ఏప్రిల్ 17 నుండి 23 వరకు), ఖతార్ (జూన్ 11 నుండి 18 వరకు), లండన్ (జూన్ 25 నుండి జూలై 6 వరకు), మరియు మలేషియా (సెప్టెంబర్ 4 నుండి 8 వరకు) వంటి దేశాలకు రాహుల్ గాంధీ చేసిన విదేశీ పర్యటనలను ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ సునీల్ ప్రస్తావించారు.

రాహుల్ గాంధీకి ప్రస్తుతం అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ లైజన్ (ఏఎస్ఎల్)తో Z+ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నారు. Z+ ఏఎస్ఎల్ భారీ ముప్పు పొంచి ఉన్న వ్యక్తులకు అందించే అత్యున్నత స్థాయి రక్షణలలో ఒకటి. నేషనల్ సెక్యూరిటీ గార్డు కమాండోలతో సహా దాదాపు 55 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. కాగా, రాహుల్ గాంధీకి భద్రత కవరేజ్ గురించి సీఆర్ఫీఎఫ్ లేఖ రాయడం ఇదే మొదటిసారి కాదు. 2020 నుంచి 2022 వరకు రాహుల్ 113 సార్లులు భద్రతా మార్గదర్శకాలను పాటించడం లేదని 2022లో ఆరోపించింది. భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు కాంగ్రెస్ పార్టీ లేఖ రాయడంతో నాడు సీఆర్ఫీఎఫ్ ఈ వివరణ ఇచ్చింది.

Next Story