అయోధ్య తరహాలోనే శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్

by Dishanational2 |
అయోధ్య తరహాలోనే శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ నాయకత్వంలో అయోధ్య రామమందిరాన్ని చట్టప్రకారం ఎలా నిర్మించామో.. అదే విధంగా మధురలోనూ శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం జరుగుతుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. మధుర, కాశీ, అయోధ్య, ఇవి హిందువులకు పవిత్ర స్థలాలు శ్రీకృష్ణ జన్మస్థలం కూడా అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణుడి జన్మస్థలంలో చట్టాన్ని అనుసరించి, సామరస్యంగా ఆలయం నిర్మాణం పూర్తవుతుందని దీమా వ్యక్తం చేశారు. ’అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన అనంతరం దేశంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ప్రపంచంలోనే రామ్ లల్లా సాక్ష్యాధారాలను ప్రదర్శించడం ఇదే తొలిసారి. ఇది ఎంతో పట్టుదలను నేర్పింది. అంతేగాక ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నందుకు గర్విస్తున్నాం’ అని చెప్పారు. రామజన్మభూమిని నిర్మించిన రీతిలోనే మధురలో కృష్ణుడి ఆలయాన్ని నిర్మించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం ఇటీవల శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి ఎక్కువ రోజులు పట్టబోదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం పక్కన ఉన్న షాహీ ఈద్గా మసీదుపై దశాబ్ధాల నుంచి వివాదం నెలకొనగా.. జ్ఞాన్‌వాపి కాంప్లెక్స్‌లోని సెల్లార్‌లో ప్రార్థనలు చేసుకోవడానికి వారణాసి జిల్లా కోర్టు ఇటీవల అనుమతిచ్చిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed