‘కోడ్‌’ను మోడీ ఉల్లంఘించారు.. చర్యలు తీసుకోండి.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

by Dishanational4 |
‘కోడ్‌’ను మోడీ ఉల్లంఘించారు.. చర్యలు తీసుకోండి.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
X

దిశ, నేషనల్ బ్యూరో : రాజస్థాన్‌లోని జాలోర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. దీంతో ఆ కామెంట్స్‌ను తప్పుపడుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. రాజస్థాన్ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు.. ఆయన హోదాకు తగిన విధంగా లేవని ఈసీ అధికారులకు తెలిపింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఓ వర్గం ప్రజలను కించపరిచేలా మోడీ వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ నేతల బృందం అభిప్రాయపడింది. ఎన్నికల వేళ మరోసారి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ప్రధాని మోడీకి సూచనలు చేయాలని ఈసీని కోరింది. ఈ అంశంపై సోమవారం మధ్యాహ్నం ఈసీ ఉన్నతాధికారులతో భేటీ అయిన కాంగ్రెస్ నేతల బృందానికి సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి సారథ్యం వహించారు.

ఆ నాలుగైదు అంశాలపై తీవ్ర అభ్యంతరం..

ఈసీ అధికారులతో భేటీ అనంతరం పూర్తి వివరాలను అభిషేక్ మను సింఘ్వి మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘దేశ ప్రధానమంత్రిగా అందరిలాగే మేం కూడా మోడీని గౌరవిస్తాం. ఎంత పెద్ద పదవిలో ఉంటే బాధ్యత అంతగా పెరుగుతుంది. ప్రసంగాల్లో చాలా జాగ్రత్తగా పదాలను వాడాల్సి ఉంటుంది. ప్రధాని మోడీ రాజస్థాన్ ప్రచార సభలో అలాంటి దారుణ వ్యాఖ్యలు చేస్తారని మేం అస్సలు ఊహించలేదు. వెంటనే ఆ కామెంట్స్‌ను ఉపసంహరించుకోవాలని చేతులు జోడించి ఆయనను కోరుతున్నాం’’ అని చెప్పారు. ‘‘ప్రధాని మోడీ ప్రసంగంలోని నాలుగైదు అంశాలపై మాకు తీవ్ర అభ్యంతరం ఉంది. మొదటిది ఆయన ప్రసంగంలో ఓ వర్గం పేరును ప్రస్తావించారు. ఆ వర్గం వారిని కించపరిచేలా మాట్లాడారు. ఆ వర్గానికే నిధుల కేటాయింపులు జరుగుతున్నాయనే తప్పుడు వాదనను తెరపైకి తెచ్చారు. ఆ మైనారిటీ వర్గానికి నిధుల కేటాయింపు వల్ల మెజారిటీ వర్గానికి అన్యాయం జరుగుతోందనే భ్రమను ప్రజల్లో కల్పించారు. హిందూ వర్గాన్ని అద్దంపట్టే మంగళసూత్రాన్ని ప్రసంగంలో ప్రస్తావించడం ద్వారా మతపరమైన అంశాన్ని ఎన్నికల ప్రచారంలో మోడీ వాడారు. ఇది ఎన్నికల కోడ్‌కు విరుద్ధం’’ అని అభిషేక్ మను సింఘ్వి చెప్పారు. ‘‘ ఎన్నికల కోడ్ నిబంధనలను అందరికీ వర్తింపజేసినట్టే.. ప్రధాని మోడీకి కూడా ఈసీ వర్తింపజేయాలి. హోదాను పట్టించుకోకుండా తప్పును తప్పుగా చూసి ఆయనపై త్వరగా చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. ‘‘ఓ మతాన్ని కించపరచడం ద్వారా.. మరో మతానికి చెందిన వారిని ప్రసంగంతో ప్రభావితం చేయడం ద్వారా ఎన్నికల కోడ్‌లోని సెక్షన్ 123ని ప్రధాని మోడీ ఉల్లంఘించారు. ఈ వివరాలన్నీ మేం ఈసీ అధికారులకు అందజేశాం’’ అని అభిషేక్ మను సింఘ్వి పేర్కొన్నారు.

బీజేపీపై మరో 16 కంప్లయింట్స్ ..

కాంగ్రెస్ ప్రతినిధి బృందం బీజేపీపై ఈసీకి మరో 16 ఫిర్యాదులు కూడా చేసింది. వాటిపైనా విచారణ జరిపి సంబంధిత బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌(యూజీసీ)లో సభ్యుల పోస్టులు 2023 ఆగస్టు నుంచి ఖాళీగా ఉంటే.. తీరా ఎన్నికల టైంలో భర్తీ చేసిన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది.

Read More...

కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్‌లో స్వల్ప మార్పులు



Next Story

Most Viewed