ఆ రాష్ట్రంలో ‘ఇండియా’ సీట్ల పంపకాలు కొలిక్కి!

by Dishanational4 |
ఆ  రాష్ట్రంలో ‘ఇండియా’ సీట్ల పంపకాలు  కొలిక్కి!
X

దిశ, నేషనల్ బ్యూరో : విపక్ష కూటమి ‘ఇండియా’లోని పార్టీల మధ్య లోక్‌సభ సీట్ల పంపకాలు మహారాష్ట్రలో ఒక కొలిక్కి వచ్చాయి. శివసేన (ఉద్ధవ్) చీఫ్ ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ రమేష్ చెన్నితాల మంగళవారం రోజు ముంబై వేదికగా దాదాపు మూడు గంటలపాటు భేటీ అయి సీట్ల సర్దుబాటుపై చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 48 లోక్‌సభ సీట్ల సర్దుబాటుపై తమ మధ్య ఒక అవగాహన కుదిరిందని ప్రకటించారు. సీట్ల పంపకాలపై జరిగిన చర్చల్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి తన మొహంపై ఉన్న నవ్వే నిదర్శనమని శివసేన నేత సంజయ్ రౌత్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్) కలిసే నడుస్తాయన్నారు. రాష్ట్రంలోని ప్రతీ సీటు గురించి ఈ భేటీలో కూలంకషమైన చర్చ జరిగిందన్నారు.

సీట్ల పంపకాలపై తొలి క్లారిటీ అక్కడే..

‘‘సీట్ల పంపకాల వివరాలను ప్రకటించే తొలి రాష్ట్రంగా మేమే నిలుస్తాం.. శివసేన చీలిపోయినా ఆ పార్టీ ప్రాబల్యం ఏమాత్రం తగ్గలేదు. ఎన్సీపీ చీలిపోయినా ఆ పార్టీ ప్రాబల్యం అస్సలు తగ్గలేదు’’ అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ రమేష్ చెన్నితాల వ్యాఖ్యానించారు. మరోవైపు ఢిల్లీ వేదికగా ఉత్తరప్రదేశ్‌లోని ఇండియా కూటమి పార్టీల ప్రతినిధులు భేటీ అయి సీట్ల పంపకాలపై చర్చించారు. సరైన దిశలోనే చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే క్లారిటీ వస్తుందని ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేత సల్మాన్ ఖుర్షీద్ వెల్లడించారు. అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్ వాదీ పార్టీ నుంచి ఇంత సానుకూల స్పందన వస్తుందని తాము ముందుగా ఊహించలేదని చెప్పారు. తదుపరి దశ సమావేశాల తర్వాత సీట్ల పంపకాలపై కీలక నిర్ణయం వెలువడొచ్చన్నారు.

Next Story

Most Viewed