సొంత వైరుధ్యాలతోనే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనమవుతుంది: మాజీ సీఎం బొమ్మై

by S Gopi |
సొంత వైరుధ్యాలతోనే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనమవుతుంది: మాజీ సీఎం బొమ్మై
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం దాని స్వంత వైరుధ్యాల కారణంగా పతనమవుతుందని బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై మంగళవారం జోస్యం చెప్పారు. అధికార పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల మధ్య ‘పోటీ’ ఉందని పేర్కొన్న ఆయన, ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌లో నిలువునా చీలిక వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ పరిణామాలు రాష్ట్రంలోని ప్రభుత్వంపై కూడా ప్రభావం చూపవచ్చు. 'లోక్‌సభ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు భారీగా ఓట్లు రాకపోతే తాను పదవిలో కొనసాగడం కష్టమేనని సీఎం అన్నారు. అలాగే, తాను ముఖ్యమంత్రి అవుతాననే కాంగ్రెస్‌కు ప్రజలు ఓటు వేశారని, కానీ ఆ విషయంలో నిరాశ చెందానని డిప్యూటీ సీఎం చెప్పారు. ఈ పరిణామాలు గమనిస్తే.. సొంత పార్టీలో నెలకొన్న వైరుధ్యాల కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోనుంది. మోడీ మూడవసారి ప్రధాని అయిన కొన్ని నెలల్లో జాతీయ స్థాయిలో కీలక మార్పులు జరగనున్నాయి. కాంగ్రెస్ నిలువునా చీలినా ఆశ్చర్యంలేదు. దాని ప్రభావం కర్ణాటకపైనా ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చెందిన మంత్రులెవరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వారి పిల్లలను పోటీలో ఉంచారు. ప్రభుత్వంలో పరిస్థితులు సానుకూలంగా లేవనేందుకు ఇది నిదర్శనమని' బొమ్మై పేర్కొన్నారు.



Next Story

Most Viewed