గుజరాత్‌లో లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్

by Disha Web Desk 7 |
గుజరాత్‌లో లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్
X

న్యూఢిల్లీ : కాంగ్రెస్ బలోపేతానికి సానుకూల దృక్పథంతో ముందుకెళ్తామని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఈ దిశగా కాంగ్రెస్ శ్రేణులు ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు గుజరాత్‌లో పార్టీ సన్నద్ధతపై కాంగ్రెస్ అగ్ర నాయకత్వం శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించింది. ఈసందర్భంగా గుజరాత్ కాంగ్రెస్ నేతలతో ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ భేటీ అయ్యారు. గుజరాత్‌లో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించే మార్గాలపై , అక్కడి బీజేపీ ప్రభుత్వం దుష్పరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన మార్గాలపై చర్చించారు.

దాదాపు రెండున్నర గంటల పాటు ఈ భేటీ జరిగింది. అనంతరం ఖర్గే ట్వీట్ చేస్తూ.. ‘‘బీజేపీ సర్కారు వైఫల్యం వల్ల గుజరాత్‌లో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలు, దళితులు, గిరిజనులపై దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి’’ అని చెప్పారు. కాగా, కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈనెల 28న మెగా ర్యాలీ జరగనుంది. దీనిలో 10 లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొననున్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులంతా పాల్గొననున్నారు.

Next Story

Most Viewed