‘మండి’లో సవాల్ : కంగనా‌పై కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే

by Dishanational4 |
‘మండి’లో సవాల్ : కంగనా‌పై కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే
X

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల కోసం 16 మంది అభ్యర్థులతో కూడిన మరో జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారం విడుదల చేసింది. ఒడిశాలోని 9, గుజరాత్‌లోని 4, హిమాచల్ ప్రదేశ్‌లోని 2, చండీగఢ్‌లోని 1 లోక్‌సభ స్థానానికి అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. వీటన్నింటిలోనూ హాట్ సీటు హిమాచల్ ప్రదేశ్‌లోని మండి. ఈ లోక్‌సభ టికెట్‌ను సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రతిభా సింగ్‌కు బదులుగా ఆమె కుమారుడు, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్‌కు కేటాయించారు. దీంతో మండి లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై విక్రమాదిత్య పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ పరిణామంపై హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న విక్రమాదిత్య తల్లి ప్రతిభా సింగ్‌ స్పందిస్తూ.. ‘‘మేం మండి లోక్‌సభ స్థానం కోసం ఇద్దరు, ముగ్గురి పేర్లను ఫైనలైజ్ చేశాం. వాటినే పార్టీ హైకమాండ్‌కు పంపాం. వారే తుది నిర్ణయం తీసుకున్నారు’’ అని స్పష్టం చేశారు. చండీగఢ్ నుంచి మనీష్ తివారీకి లోక్‌సభ టికెట్ ఇచ్చారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ కిరణ్ ఖేర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి సంజయ్ టాండన్‌ పోటీ చేస్తున్నారు.



Next Story

Most Viewed