జంతర్ మంతర్ వద్ద ఘర్షణ.. పలువురు రెజ్లర్లకు గాయాలు

by Disha Web Desk 12 |
జంతర్ మంతర్ వద్ద ఘర్షణ.. పలువురు రెజ్లర్లకు గాయాలు
X

న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజర్లపై బుధవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. మద్యం తాగి వచ్చిన పోలీసులు తమను ఇష్టం వచ్చినట్లు కొట్టారని అంతర్జాతీయ రెజర్లు ఆరోపించారు. ఆందోళన శిబిరం వద్ద తాము నిద్రించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా లాఠీలతో విరుచుకు పడ్డారని, మహిళా రెజ్లర్లను దూషించారని ఆసియా, కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత వినేష్ పొగట్, ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ కంటతడి పెట్టారు. ఇలాంటి రోజు చూసేందుకేనా దేశానికి పతకాలు గెలిచిందని భావోద్వేగానికి లోనయ్యారు.

పతకాలు తిరిగి ఇచ్చేస్తాం: రెజర్లు

ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి బుధవారం రాత్రి మడత మంచాలు తీసుకొచ్చారు. వాటిని రెజ్లర్లకు ఇవ్వకుండా అడ్డుకున్న పోలీసులతో సోమ్ నాథ్ భారతి అనుచరులు వాగ్వాదానికి దిగారు. వారికి మద్దతుగా నిలబడిన రెజ్లర్లను పోలీసులు తోసేశారు. ఈ ఘర్షణలో కొందరు రెజ్లర్లకు గాయాలయ్యాయి. తనను మగ పోలీసులే నెట్టేశారని, దుర్భాషలాడారంటూ కన్నీళ్లు పెట్టుకున్న సాక్షి మాలిక్ ను వినేష్ పొగట్ ఓదార్చారు. ‘తుపాకులు పట్టుకున్న పోలీసులు మమ్మల్ని చంపాలనుకుంటే చంపేయండి’ అని వినేష్ పొగట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిండి కూడా తినకుండా చేశారని వాపోయారు.

పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా తాము సాధించిన పతకాలు, ప్రభుత్వం ఇచ్చిన పద్మ అవార్డులను తిరిగి ఇచ్చేస్తామని హెచ్చరించారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలంటూ రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద కొంత కాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. నేరం చేసిన బ్రిజ్ భూషణ్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడని, పోలీసులు మాత్రం తమపై దాడి చేస్తున్నారని రెజ్లర్లు మండిపడ్డారు. ఈ ఘటనపై విపక్షాలు మండిపడ్డాయి.


Next Story