బీజేపీ సభ్యత్వం ఉంటేనే పౌరసత్వమేమో.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హాట్ సెటైర్లు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-25 09:24:57  IST  )

పాస్‌పోర్టుతో పౌరసత్వం రాదన్న విదేశాంగ శాఖ వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ సభ్యత్వం ఉంటేనే పౌరసత్వమేమో.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హాట్ సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: పౌరసత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ విధానాలు, విదేశాంగ శాఖ వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాస్‌పోర్టు ఉన్నంత మాత్రాన పౌరసత్వం వర్తించదని వస్తున్న వార్తలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి గందరగోళ నిర్ణయాల వల్ల దేశంలోని సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.

విదేశాంగ తీరు హాస్యాస్పదం..

ఈ అంశంపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ తీరును తప్పుబడుతూ.. ఈ లెక్కన చూస్తుంటే భవిష్యత్తులో కేవలం భారతీయ జనతా పార్టీ (BJP) సభ్యత్వం ఉన్న కార్డులు ఉన్నవారికే పౌరసత్వం ఇచ్చేలా ఉన్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యత్వానికి సంబంధించిన ఐడీ కార్డులను ఆయన తన ‘X’ ఖాతాలో షేర్ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. దేశ పౌరుడిగా అంతర్జాతీయంగా గుర్తింపునిచ్చే అత్యున్నత అధికారిక పత్రాలలో ఒకటైన పాస్‌పోర్టును కూడా పౌరసత్వానికి నిదర్శనం కాదనడం అత్యంత హాస్యాస్పదమన్నా ఒవైసీ అన్నారు. ప్రభుత్వాల నిరంతర నిబంధనల మార్పుల వల్ల సాధారణ పౌరులు తమ సొంత దేశంలోనే తాము పౌరులమని నిరూపించుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పౌరసత్వం, గుర్తింపు కార్డుల పేరుతో కేంద్రం రాజకీయాలు చేస్తోందని, త్వరలోనే దీనిపై ప్రజలు భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతారని ఓవైసీ హెచ్చరించారు.

Next Story