5వ తరగతిలో బెత్తం దెబ్బలు ఎన్నటికీ మర్చిపోలేను: సీజేఐ డీవై చంద్రచూడ్

by Dishanational1 |
5వ తరగతిలో బెత్తం దెబ్బలు ఎన్నటికీ మర్చిపోలేను: సీజేఐ డీవై చంద్రచూడ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇప్పుడైతే స్కూళ్లలో పిల్లలపై చేయి చేసుకోవడం, దండించడం నేరంగా చూస్తున్నారు. అయితే, కొన్నేళ్ల క్రితం వరకు స్కూళ్లలో పిల్లల క్రమశిక్షణ కోసం ఒక దెబ్బ వేయడం చాలా సాధారణం. అలాంటి అనుభవమే తనకూ ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. తాను కూడా చిన్నప్పుడు స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నానని ఆయన ఓ కార్యక్రమంలో చెప్పారు. ఆ సంఘటన జీవితాంతం గుర్తుంటుందని, తనపై బలమైన ముద్ర వేసిందని అన్నారు. ఇటీవల నేపాల్‌లో 'జువైనల్ జస్టిస్' అంశంపై జరిగిన సదస్సుకు హాజరైన సీజేఐ.. పిల్లలతో ఉపాధ్యాయులు ఎలా ప్రవర్తిస్తారనేది వారికి జీవితాంతం గుర్తుంటుంది. నేను ఐదవ తరగతి చదువుతున్న రోజుల్లో జరిగిన ఒక సంఘటన ఎన్నటికీ మర్చిపోలేను. తానేమీ అల్లరి చేసి దెబ్బలు తినే రకం పిల్లాడిని కాదు. అయితే, ఆరోజు క్రాఫ్ట్ నేచుకునే సమయంలో అసైన్‌మెంట్ కోసం కావాల్సిన సరైన సైజు సూది తీసుకెళ్లలేదు. అది తెలుసుకున్న మా టీచర్ కోపంగా బెత్తంతో నా చేతిపై బలంగా కొట్టారు. చేతిపైన కాకుందా మరెక్కడైనా కొట్టాలని వేడుకున్నాను. టీచర్ కొట్టిన దెబ్బలకు నా కుడి చేయి కందిపోయిది. ఆ అవమానంతో 10 రోజుల వరకు చేతిని ఎవరికీ చూపించలేకపోయాను ' అని ఆయన వివరించారు. కొద్దిరోజులకు ఆ గాయం నయమైనప్పటికీ ఆ సంఘటనను తనపై చాలా ప్రభావం చూపించింది. న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్న బాలల బలహీనతలు, ప్రత్యేక అవసరాలను గుర్తించాలని చంద్రచూడ్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed