లీకేజీ డ్రామాలకు చెక్.. టెలిగ్రామ్ నిషేదంపై NTA వివరణ

by Malleboina Mahesh |

నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్‌పై కేంద్రం కొరడా.. జూన్ 22 వరకు యాప్‌పై తాత్కాలిక నిషేధం! జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ నిలిపివేతపై ఎన్టీయే అధికారిక ప్రకటన.

లీకేజీ డ్రామాలకు చెక్.. టెలిగ్రామ్ నిషేదంపై NTA వివరణ
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా జూన్ 21న జరగబోయే నీట్-యుజి (NEET UG 2026) రీ ఎగ్జామ్స్ పారదర్శకతను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో టెలిగ్రామ్ (Telegram) యాప్‌పై తాత్కాలిక ఆంక్షలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జాతీయ పరీక్షల సంస్థ (NTA) సిఫార్సుల మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) ఐటీ చట్టం సెక్షన్ 69A కింద జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాక్సెస్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. కొన్ని సైబర్ నేరగాళ్ల ముఠాలు, అనామక టెలిగ్రామ్ ఛానెళ్లు అభ్యర్థుల నుంచి ప్రశ్నపత్రాల లీకేజీ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు (I4C), బీహార్, గుజరాత్, రాజస్థాన్ పోలీసులు గుర్తించడంతో ఈ కఠిన చర్యలు చేపట్టారు. పరీక్షల భద్రత దృష్ట్యా కేంద్రం తీసుకున్న ఈ సమయానుకూల నిర్ణయాన్ని NTA పూర్తిగా స్వాగతించింది.

ఈ మోసాలతో పాటు, పరీక్ష ముగిసిన తర్వాత ప్రశ్నపత్రాన్ని అప్‌లోడ్ చేసి, మెసేజ్‌ను ఎడిట్ చేయడం ద్వారా పరీక్షకు ముందే పేపర్ లీక్ అయినట్లు తప్పుడు స్క్రీన్‌షాట్లు సృష్టించి పుకార్లు పుట్టిస్తున్నట్లు అధికారులు గమనించారు. ఈ 'మెసేజ్ ఎడిటింగ్' ఫీచర్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి, జూన్ 30 వరకు భారతదేశంలో ఈ ఫీచర్‌ను నిలిపివేయాలని కేంద్రం టెలిగ్రామ్ సంస్థను ఆదేశించింది. గుజరాత్‌లో రూ.1.5 కోట్ల మేర సైబర్ మోసానికి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను ఇప్పటికే అరెస్టు చేయగా, సీబీఐ కూడా దీనిపై విచారణ జరుపుతోంది. ఈ ఆంక్షల వల్ల సాధారణ వినియోగదారులకు కొంత ఇబ్బంది కలిగినప్పటికీ, పరీక్షల పారదర్శకతను కాపాడటానికి మరియు అభ్యర్థులు తప్పుడు పుకార్ల బారిన పడకుండా ఉండటానికి ఈ నిర్ణయం అనివార్యమైందని NTA స్పష్టం చేసింది. జూన్ 21న పరీక్ష యథావిధిగా జరుగుతుందని, అభ్యర్థులు ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించింది.

Next Story