చాట్‌జీపీటీ సంభాషణలు అనుకున్నంత సేఫ్ కాదు: సీఈవో శ్యామ్ ఆల్ట్‌మ్యాన్

by Phanindra |

చాట్‌జీపీటీ సంభాషణలు అనుకున్నంత సేఫ్ కాదని, కోర్టులు అడిగితే కచ్చితంగా తాము వాటిని ఇవ్వాల్సి ఉంటుందని ఓపెన్ఏఐ సీఈవో శ్యామ్ ఆల్ట్‌మ్యాన్ వెల్లడించారు.

చాట్‌జీపీటీ సంభాషణలు అనుకున్నంత సేఫ్ కాదు: సీఈవో శ్యామ్ ఆల్ట్‌మ్యాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: చాట్‌జీపీటీలో ప్రైవసీపై ఓపెన్ ఏఐ సీఈవో శ్యామ్ ఆల్ట్‌మ్యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్లు, లాయర్లు, థెరపిస్టుల వంటి వారి వద్ద ప్రజలు సంభాషణ గోప్యంగా ఉంటుందని, కానీ ఆ రూల్స్ చాట్‌జీపీటీకి వర్తించవరి ఆయన స్పష్టంచేశారు. అందుకొని తాము ఈ డేటాను ఎక్కడపడితే అక్కడ ప్రచురించకపోయినా.. ఏదైనా కోర్టు కేసుల వంటి ఘటనల్లో ఆదేశాలు అందితే సదరు యూజర్ చాట్ హిస్టరీ మొత్తాన్ని కోర్టుకు అందజేయాల్సి ఉంటుందని వివరించారు.

‘చాట్‌జీపీటీతో తమ వ్యక్తిగత విషయాలను, సమస్యలను చాలా మంది యువత పంచుకుంటున్నారు. అయితే ఇవన్నీ పూర్తిగా గోప్యంగా ఉండటం కుదరదు. కోర్టులు ఆదేశిస్తే ఈ వివరాలన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఏఐ రంగంలో ఇంకా అంత గోప్యత లేదు’ అని ఆల్ట్‌మ్యాన్ చెప్పారు. కోర్టు కేసుల సమయంలో ఇది యూజర్ల ప్రైవసీకి ఇబ్బందికి కలిగించే అవకాశం ఉందన్నారు.

మరో సమస్య..

వాట్సాప్ వంటి యాప్స్‌లో మనం పంపించే మెసేజిలను సదరు కంపెనీ కూడా నేరుగా చూడలేదు. ఎందుకంటే ఈ మెసేజ్‌లు ఎన్‌క్రిప్ట్ అయ్యి ఉంటాయి. కానీ చాట్‌జీపీటీలో అలా కాదు. ఏఐతో యూజర్ల సంభాషణను ఓపెన్ఏఐ ఉద్యోగులు కూడా చదవొచ్చు. ఏఐ ఇచ్చే సమాధానాలను మరింత మెరుగు పరిచేందుకు, అలాగే తమ టూల్‌ను ఎవరైనా తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారా? అని గమనించేందుకు ఇలా చేస్తారట.

ఇలాంటి సమస్యలనే ఎత్తి చూపుతూ చాట్‌‌జీపీటీలో ప్రజలు చేసే సంభాషణలు మొత్తాన్ని ఆ కంపెనీ స్టోర్ చేయాలని, డిలీట్ చేసిన సంభాషణలను కూడా దాచి ఉంచాలని, అవసరమైతే వాటిని కోర్టుల్లో సబ్‌మిట్ చేయాలని ‘ది న్యూయార్క్ టైం’ అనే పత్రిక కేసు వేసింది. దీన్ని తాము అప్పీల్ చేస్తామని చెప్పిన ఓపెన్ ఏఐ.. చాట్‌జీపీటీలో డిలీట్ చేసిన సంభాషణలను తాము కూడా 30 రోజుల్లో పూర్తిగా డిలీట్ చేసేస్తామని, ఏదైనా సందర్భాల్లో కోర్టుల ఆదేశాలు ఉంటేనే వాటిని స్టోర్ చేస్తామని ఆల్ట్‌మ్యాన్ వివరించారు.

Next Story