యాపిల్ యూజర్లకు కేంద్రం హ్యాకింగ్ అలర్ట్

by Dishanational1 |
యాపిల్ యూజర్లకు కేంద్రం హ్యాకింగ్ అలర్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: యాపిల్ ఉత్పత్తులను వాడుతున్న వినియోగదారులకు కేంద్ర భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేసింది. ఐఫోన్‌తో పాటు ఐప్యాడ్స్, మ్యాక్‌బుక్, విజన్ ప్రో హెడ్‌సెట్‌లకు 'హై-రిస్క్' ఉందని, ఈ ఉత్పత్తుల్లో రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్‌కు సంబంధించిన ప్రధాన సెక్యూరిటీ లోపం ఉన్నట్టు గుర్తించామని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ పేర్కొంది. ఈ లోపాన్ని ఉపయోగించి హ్యాకర్లు ఆర్బిటరీ కోడ్‌ను ఎగ్జిక్యూట్ చేసి డివైజ్‌లను రిపోట్ పద్దతిలో ఆపరేట్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కాబట్టి యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్ సెక్యూరిటీ వెర్షన్‌తో అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఐఓఎస్‌, ఐప్యాడ్‌ ఓఎస్‌ 17.4.1, 16.7.7 కంటే ముందు వెర్షన్ల, సఫారీ 17.4.1, మ్యాక్‌ఓఎస్‌ వెంట్యూరా 13.6.6, మ్యాక్‌ఓఎస్‌ సొనొమా 14.4.1, యాపిల్‌ విజన్‌ ఓఎస్‌ 1.1.1 కంటే ముందు వెర్షన్లలో ఈ లోపం ఉన్నట్టు గమనించామని పేర్కొంది. అదేవిధంగా 17.4.1 కంటే ముందు ఓఎస్‌ను వినియోగించే ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌, ఐప్యాడ్‌ ప్రో 12.9, 10.5, 11 ఇంచ్‌, ఐప్యాడ్‌ ఎయిర్‌, ఐప్యాడ్‌ మినీ యూజర్లకు ఈ ముప్పు ఉందని తెలిపింది. 16.7.7 వెర్షన్‌ కంటే ముందు ఓఎస్‌లను వాడే ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌, ఐఫోన్‌ ఎక్స్‌, ఐప్యాడ్‌ 5 జెనరేషన్‌, ఐప్యాడ్‌ ప్రో 9.7 యూజర్లు కూడా హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉంది. యూజర్లు వెంటనే తమ డివైజ్‌లను అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది.


Next Story