టెలిగ్రామ్, సిగ్నల్‌లకు కేంద్రం నోటీసులు.. ఆ ఫీచర్‌పైనే ప్రభుత్వం సీరియస్!

by Kema Shiva Kumar |

‘యూజర్ నేమ్’ ఫీచర్‌పై ఇప్పటికే వాట్సాప్‌ మాతృ సంస్థ ‘మెటా’‌కు నోటీసులు జారీ చేసిన కేంద్రం.. తాజాగా మరో రెండు యాప్స్‌కు కూడా సమన్లు పంపింది.

టెలిగ్రామ్, సిగ్నల్‌లకు కేంద్రం నోటీసులు.. ఆ ఫీచర్‌పైనే ప్రభుత్వం సీరియస్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్‌లు టెలిగ్రామ్ (Telegram), సిగ్నల్ (Signal) యాప్‌‌లపై కేంద్ర ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ రెండు యాప్‌లలో ఉన్న యూజర్‌నేమ్ (Username) ఫీచర్‌కు సంబంధించి కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) వాటికి అధికారికంగా నోటీసులు జారీ చేసింది, అయితే, సైబర్ నేరాలు, ఫేక్ న్యూస్ సర్క్యూలేషన్‌తో జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అంశాలపై దర్యాప్తు చేసేటప్పుడు నేరస్థులను గుర్తించడంలో ‘యూజర్‌నేమ్’ ఫీచర్ అడ్డంకిగా మారుతోందని ప్రభుత్వం భావిస్తోంది.

కాగా, టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లలో యూజర్లు తమ ఫోన్ నంబర్ ఇతరులకు కనిపించకుండా, కేవలం ఒక యూజర్‌నేమ్ క్రియేట్ చేసుకుని చాట్ చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో ప్రైవసీ ఉంటుందని యూజర్లు భావిస్తున్నప్పటికీ, సైబర్ నేరగాళ్లు దీనిని ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని భద్రతా సంస్థలు గుర్తించాయి. ఫోన్ నంబర్ లేకపోవడం వల్ల సదరు అకౌంట్ వెనుక ఉన్న అసలైన వ్యక్తిని గుర్తించడం (Traceability) దర్యాప్తు సంస్థలకు అత్యంత కష్టతరంగా మారుతోంది. ఈ క్రమంలోనే భారతీయ ఐటీ చట్టాల (IT Rules) ప్రకారం అనుమానాస్పద అకౌంట్ల మూలాలను, వాటిని వాడుతున్న వ్యక్తుల వివరాలను అవసరమైనప్పుడు ప్రభుత్వానికి అందించేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని కేంద్రం ఈ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఇదే విషయంలో కేంద్ర ఇప్పటికే వాట్సాప్‌ యాప్‌పై మేటా (META)కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Next Story