టెలికాం డిపార్ట్‌మెంట్‌ పేరుతో వచ్చే నకిలీ కాల్స్‌పై కేంద్రం సూచనలు

by Dishanational1 |
టెలికాం డిపార్ట్‌మెంట్‌ పేరుతో వచ్చే నకిలీ కాల్స్‌పై కేంద్రం సూచనలు
X

దిశ, నేషనల్ బ్యూరో: టెలికాం విభాగం పేరుతో నకిలీ కాల్స్ చేసి ప్రజలను మోసం చేస్తున్న ఘటనలపై శుక్రవారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ) సూచనలు జారీ చేసింది. కొందరు మోసగాళ్లు చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొన్నారంటూ, మొబైల్ నంబర్‌ను డిస్‌కనెక్ట్ చేస్తామని ఫోన్లు చేస్తున్నారు. అలాగే, విదేశీ మొబైల్ నంబర్ల నుంచి వాట్సాప్ కాల్ చేసి ప్రభుత్వాధికారులమని బుకాయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రకటనను విడుదల చేసింది. 'సైబర్ నేరగాళ్లు ఇటువంటి కాల్స్ చేసి ఆర్థిక మోసానికి పాల్పడే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత సమాచారాన్ని బెదిరించి దొంగలించేందుకు ప్రయత్నిస్తారు. అటువంటి కాల్స్‌కు బదులివ్వొద్దు. టెలికాం విభాగం ఎన్నడూ అలాంటి కాల్స్ చేసే అధికారం ఏ అధికారికి ఇవ్వదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటువంటి కాల్స్ వస్తే మీ సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని' సూచించింది. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ క్రైమ్ లేదా ఆర్థిక మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని పేర్కొంది. అలాగే, సంచార్ సాథీ పోర్టల్‌లో 'నో యువర్ మొబైల్ కనెక్షన్స్' ఆప్షన్ సదుపాయం ద్వారా తమ పేరున ఇతర మొబైల్ నంబర్ కనెక్షన్ ఉంటే సరిచూసుకోవాలని, సంబంధం లేని నంబర్లు తమ పేరున ఉంటే రిపోర్ట్ చేయవచ్చని టెలికాం విభాగం పేర్కొంది.


Next Story

Most Viewed