గర్భాన్ని తొలగించే అనుమతి ఉత్తర్వులను రీకాల్ చేయాలని కోరిన కేంద్రం

by Dishanational1 |
గర్భాన్ని తొలగించే అనుమతి ఉత్తర్వులను రీకాల్ చేయాలని కోరిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: భర్త మృతితో 29 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రీకాల్ చేయాలని కోరుతూ కేంద్రం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. బిడ్డ బతికే అవకాశం ఉందని, పుట్టబోయే బిడ్డ జీవించే హక్కును కోర్టు పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. మహిళకు వైద్య పరీక్షలు చేసిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) కూడా కోర్టును ఆశ్రయించింది. గర్భం దాల్చిన 34 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పూర్తయాక బిడ్డను ప్రసవిస్తే ఫలితం మెరుగ్గా ఉంటుంది. తల్లి, బిడ్డ ఆరోగ్యం మెరుగుపడేందుకు గర్భాన్ని మరో రెండు-మూడు వారాల పాటు కొనసాగించడం మంచిదని సూచించింది. ఈ విషయంలో తదుపరి చర్యలపై ఆదేశాలు జారీ చేయాలని ఎయిమ్స్ కోరింది. మహిళ ఆరోగ్యంతో పాటు పిండం ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, జనవరి 16, 17, 18 తేదీల్లో ఎయిమ్స్‌లో తదుపరి మానసిక పరీక్ష, కౌన్సెలింగ్ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఇటీవల భర్త మృతి చెందిన కారణంతో మానసికంగా దెబ్బతినడంతో గర్భాన్ని తొలగించుకునేందుకు న్యాయమూర్తి సుబ్రమణియం ప్రసాద్ అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎయిమ్స్ వైద్యుల నివేదికను ప్రస్తావించిన జస్టిస్ ఆమె మానసిక స్థిరత్వాన్ని కోల్పోతోందని, తనకు తాను హానీ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ కారణంతో గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు.


Next Story