ప్రధాని పొదుపు మంత్రం.. దేశంలో ఇంధన నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన

by Prasad Jukanti |

అంతర్జాతీయ మార్కెట్లో ధరల అస్థిరత నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్యాకేజీ ఇచ్చే ఉద్దేశం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

ప్రధాని పొదుపు మంత్రం..  దేశంలో ఇంధన నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన
X
దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు పొదుపు మంత్రాన్ని పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్యాకేజీ ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇవాళ రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన మంత్రుల కీలక భేటీ నిర్వవహించారు. ఈ సందర్భంగా పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ (మార్కెటింగ్ & ఆయిల్ రిఫైనరీ) సుజాత శర్మ మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. పంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడి, అంతర్జాతీయ మార్కెట్లో ధరల్లో తీవ్ర అస్థిరత కనిపిస్తున్నప్పటికీ, భారత్‍లో ఇంధన సరఫరా సజావుగా సాగుతోందని స్పష్టం చేశారు. సాధారణ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకున్న సమర్థవంతమైన చర్యల వల్ల దేశంలో ముడి చమురు నిల్వలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

కొరత లేదు:

ప్రస్తుతం దేశంలోని ఆయిల్ రిఫైనరీలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని ఎక్కడా పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిండుకున్న (dry-outs) సందర్భాలు లేవని ఆమె స్పష్టం చేశారు. అలాగే ఎల్పీజీ (LPG) డిస్ట్రిబ్యూటర్ పాయింట్లలో కూడా ఎటువంటి కొరత లేదని తెలిపారు. పెట్రోల్, డీజిల్ తగినంత స్టాక్ అందుబాటులో ఉందని, గృహ అవసరాల కోసం ఎల్పీజీ సరఫరాను నిరంతరం కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. గత మూడు రోజుల్లో 1 కోటి 14 లక్షల బుకింగ్‌లకు గాను 1 కోటి 26 లక్షల ఎల్పీజీ సిలిండర్లను గృహాలకు పంపిణీ చేశామని ఆమె వివరించారు. అదేవిధంగా వాణిజ్య ఎల్పీజీ విక్రయాలు 17,000 టన్నులు, ఆటో ఎల్పీజీ విక్రయాలు 762 టన్నులు దాటాయని గణాంకాలను వెల్లడించారు.

పొదుపు పాటించాలి:

దేశ ప్రజలంతా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని ఈ సందర్భంగా సుజాత శర్మ గుర్తు చేశారు. సాధ్యమైన చోటల్లా మెట్రో ఇతర ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించాలని, కార్‌పూలింగ్ పద్ధతిని పాటించాలని ప్రధాని సూచించినట్లు పేర్కొన్నారు. వస్తు రవాణా కోసం రైల్వేలకు ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యుత్ వాహనాల (EV) వినియోగాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. మన దైనందిన జీవితంలో ఇంధనాన్ని ఆదా చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని, తద్వారా దేశంపై ప్రస్తుతం ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చని ఆమె పిలుపునిచ్చారు. ఈ సంక్షోభ సమయంలో ఇంధన పొదుపు కోసం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని ఆమె ఆకాంక్షించారు. చమురు కంపెనీలకు రోజుకు రూ. 1700 కోట్ల నష్టం వాటిల్లుతోందని 10 వారాల్లో లక్ష కోట్ల రుపాయల నష్టం జరిగిందన్నారు.

Next Story