సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దుపై కోర్టుకెక్కిన సెలెబీ..!

by Phanindra |

భద్రతా కారణాల దృష్ట్యా టర్కీకి చెందిన సెలెబీ ఏవియేషన్స్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్‌ను భారత్ రద్దు చేసింది. దీనిపై ఆ కంపెనీ కోర్టుకెక్కింది.

సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దుపై కోర్టుకెక్కిన సెలెబీ..!
X

దిశ, నేషనల్ బ్యూరో: టర్కీకి చెందిన సెలెబీ ఏవియేషన్‌పై భారత ప్రభుత్వం కొరడా ఝుళిపించిన సంగతి తెలిసిందే. దేశంలోని పలు ప్రధాన విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను సెలెబీ సంస్థ అందించేది. అయితే భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలో సమయంలో పూర్తిగా పాక్‌కు మద్దతివ్వడం, ఉగ్రవాదులపై భారత్ చేసిన ‘ఆపరేషన్ సిందూర్‌’ను టర్కీ ప్రభుత్వం తప్పుబట్టడంతో ఈ సంస్థకు వ్యతిరేకంగా పలువురు ఫిర్యాదులు చేశారు. దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు టర్కీకి చెందిన ఈ సంస్థ చేతుల్లో ఉంటే దేశ భద్రతకు ముప్పుంటుందని హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలోనే సెలెబీకి సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిర్ణయంపై ఢిల్లీ హైకోర్టులో సెలెబీ ప్రతినిధులు పిటిషన్ వేశారు. ఎలాంటి వివరణ లేకుండా కేవలం దేశభద్రత అనే మాటతో ఇంత పెద్ద ఒప్పందాన్ని రద్దు చేయడం సరికాదని ఆ కంపెనీ వాదించింది. ‘ఈ ఆదేశాలను వెంటనే వెనక్కు తీసుకోవాలి. ఇది 3791 మంది ఉద్యోగులపై ప్రభావం చూపించే అంశం. ఈ నిర్ణయం తీసుకునే ముందు మాకు ఎలాంటి హెచ్చరిక కూడా చెయ్యలేదు. కేవలం జాతీయ భద్రత అనే మాట చెప్పి, ఎలాంటి వివరణ లేకుండా ఇలా ఒప్పందాలు రద్దు చేయడం చట్టప్రకారం కరెక్ట్ కాదు’ అని కోర్టుకు సెలెబీ తెలిపిందట.

తమ కంపెనీ రిజిస్టర్ అయింది టర్కీలోనే అయినా.. కంపెనీ తుది నిర్ణయాలన్నీ టర్కీతో ఏమాత్రం సంబంధం లేని కంపెనీల చేతుల్లోనే ఉందని సెలెబీ వాదించింది. అలాగే ఇలా సడెన్‌గా క్లియరెన్స్ రద్దు చెయ్యడం వంటి నిర్ణయాలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే ఇతర కంపెనీలను ఆందోళనకు గురిచేస్తాయని కూడా సెలెబీ హెచ్చరించింది. ఈ పిటిషన్‌పై సోమవారం నాడు విచారణ జరిగే అవకాశం ఉంది.

Next Story