Ceasefire: భారత్ పాక్ సీజ్ ఫైర్.. సింధూ జలాల ఒప్పందం కొనసాగుతుందా?

by vinod kumar |
Ceasefire: భారత్ పాక్ సీజ్ ఫైర్.. సింధూ జలాల ఒప్పందం కొనసాగుతుందా?
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ పాక్‌ల మధ్య కొనసాగిన ఉద్రిక్తతలకు కాల్పుల విరమణతో తెరపడిన విషయం తెలిసిందే. ఇరు వర్గాలూ దీనిని ధ్రువీకరించాయి. దీంతో ఇరు దేశాల్లో పరిస్థితి కాస్త సద్దుమణిగినట్టు కనిపిస్తోంది. అయితే పహెల్గాం ఉగ్రదాడి అనంతరం నిలిపివేసిన సిందూ జలాల ఒప్పందం (Indus treaty)లో ఎటువంటి మార్పూ ఉండబోదని భారత విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించారు. శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ సిందూ జలాల నిషేధం ఉంటుందని తెలుస్తోంది. అగ్రిమెంట్‌లో భాగంగా దీనిపై ఎటువంటి చర్చ జరగలేదని సమాచారం. కేవలం ఉద్రిక్తతలు తగ్గించేందుకు మాత్రమే ప్రస్తుత సీజ్ ఫైర్ (Cease fire) ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. ‘భారత్ వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం సహా మా దౌత్య విధానం అలాగే కొనసాగుతుంది. సరిహద్దు ఉగ్రవాదానికి పాక్ నిరంతర మద్దతు ఇవ్వడంపై ఆందోళనలున్నాయి. టెర్రరిజంపై పోరు కొనసాగుతుంది’ అని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

కాగా, గత నెలలో జమ్మూ కశ్మీర్‌లోని పహెల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత సిందూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. అంతేగాక చీనాబ్, జీలం నదుల నుంచి కూడా పాక్‌కు వెళ్లే నీటిని ఆపివేసింది. దీంతో పాక్ లోని పంజాబ్ ప్రావీన్సుపై తీవ్ర ప్రభావం పడినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా కాల్పుల విరమణ జరిగినప్పటికీ ఈ అంశం విషయంలో ఎటువంటి మార్పూ ఉండబోదని భారత్ స్పష్టం చేస్తోంది. దాడులు ఆగినప్పటికీ పాక్‌కు మాత్రం సమస్యలు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ నెల 12న జరిగే ఇరు దేశాల ప్రతినిధుల సమావేశంలో మరిన్ని విషయాలపై చర్చించే చాన్స్ ఉంది.



Next Story

Most Viewed