ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండలేను: బీజేపీతో పొత్తు నేపథ్యంలో ఆర్ఎల్డీని వీడిన కీలక నేత

by Dishanational2 |
ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండలేను: బీజేపీతో పొత్తు నేపథ్యంలో ఆర్ఎల్డీని వీడిన కీలక నేత
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎన్డీయే కూటమిలో చేరడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆర్ఎల్డీ జాతీయ ఉపాధ్యక్షుడు షాహిద్ సిద్ధిఖీ పార్టీకి రిజైన్ చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ జయంత్ సింగ్‌కి పంపినట్టు తెలిపారు. ‘ప్రస్తుతం భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఈ సమయంలో బీజేపీతో జతకట్టడం సరికాదు. మౌనంగా ఉండటం కూడా పాపం. ఎంతో భారంతో ఆర్ఎల్డీని వీడుతున్నా’ అని పేర్కొన్నారు. బీజేపీతో పెట్టుకోవడం నా సొంత విశ్వాసాలకు విరుద్ధంగా ఉందని తెలిపారు. ఆర్ఎల్డీ కోసం ఎంతో కష్టపడ్డప్పటికీ ఎన్డీయేలో చేరడం అసంతృప్తికి గురి చేసిందని చెప్పారు.

‘ప్రపంచంలోనే భారత్ ఎంతో గొప్ప దేశం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగబద్ద సంస్థలన్నీ ధ్వంసమవుతున్నాయి. ఇప్పుడు మౌనంగా ఉండలేను’ అని తెలిపారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తమ కుటుంబం పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కు ప్రధాని మోడీ దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించిన తర్వాత జయంత్ చౌదరికి చెందిన ఆర్ఎల్డీ పార్టీ ఇటీవల బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరింది. సీట్ షేరింగ్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో రెండు స్థానాలను ఆర్ఎల్డీకి కేటాయించింది. ఈ రెండు చోట్ల అభ్యర్థులను సైతం ఆర్ఎల్డీ ప్రకటించింది. 2014లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఆర్ఎల్డీ, 2019లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలతో పొత్తు పెట్టుకుంది.

Next Story

Most Viewed