జీ7లో భారత్ కచ్చితంగా ఉండాలి.. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ లేకపోతే ఎలా?

by Phanindra |   (  Updated:2025-06-07 15:16:38  IST  )

జీ7లో భారత్ కచ్చితంగా ఉండాలన్న కెనడా ప్రధాని.. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ లేకపోతే ఎలా?

జీ7లో భారత్ కచ్చితంగా ఉండాలి.. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ లేకపోతే ఎలా?
X

దిశ, నేషనల్ బ్యూరో: జీ7 శిఖరాగ్ర సదస్సులో భారత్ పాల్గొనడం చాలా ముఖ్యమని కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి కాల్ చేసిన కార్నీ.. జీ7 సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భారత్ పాల్గొనడం ఎంత ముఖ్యమో వివరించిన కార్నీ.. జీ7 చైర్‌గా మిగతా సభ్యులతో ఎన్నో కీలక విషయాలు చర్చకు వస్తాయని, ఈ చర్చల్లో భారత్ ఉండటం చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. ‘కెనడా జీ7 చైర్‌గా ఎనర్జీ, సెక్యూరిటీ, డిజిటల్ భవితవ్యం, కీలకమైన మినరల్స్ సహా ఎన్నో చాలా ముఖ్యమైన అంశాలపై జీ7 సభ్యులతో చర్చలు జరపాలి. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాల్లో భాగస్వామ్యంపై కూడా కీలక చర్చ జరగాలి. ప్రపంచంలోని ఎన్నో సప్లై చైన్లకు భారత్ కేంద్రం. అలాంటి దేశంతో సంప్రదింపులు లేకపోతే ఎలా?’ అని ఆయన ప్రశ్నించారు.

‘చర్చల్లో కచ్చితంగా ఉండాల్సిన కొన్ని దేశాలున్నాయి. ఆ దేశాలేవి? అనే నిర్ణయం జీ7 చైర్‌గా కొందరితో సంప్రదింపులు చేసి నేనే తీసుకుంటా. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్, అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం, ఎన్నో సప్లై చైన్లకు గుండె వంటిది. అలాంటి దేశం చర్చల్లో ఉండటమే కరెక్ట్’ అని కార్నీ వివరించారు. అలాగే లా ఎన్‌ఫోర్స్‌మెంట్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, తను చర్చలు జరుపుతామని కూడా చెప్పారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొనే మోడీని కెనడాకు ఆహ్వానించానని, మోడీ ఈ ఇన్విటేషన్‌ను స్వీకరించారని కార్నీ పేర్కొన్నారు. భారత్, కెనడా మధ్య సంబంధాలు ఇటీవల కొంచెం దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఖలిస్తానీ వేర్పాటువాది నిజ్జర్‌ను భారత ఏజెంట్లు చంపేశారని గతంలో ట్రూడో ప్రభుత్వం ఆరోపణలు చేసింది. వీటిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలోనే ఇరుదేశాలు ఎంబసీల్లోని అధికారులను కూడా తొలగించారు. దీంతో కెనడాలో జరుగుతున్న జీ7 కార్యక్రమానికి మోడీ వెళ్లరనే ప్రచారం కూడా సాగింది.

Next Story