పార్లమెంటు ఉభయ సభలు సోమవారానికి వాయిదా

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-25 09:53:26  IST  )

పార్లమెంటు (Parliament) వర్షాకాల సమావేశాలు ఇవాళ మరోసారి వాయిదా పడ్డాయి.

పార్లమెంటు ఉభయ సభలు సోమవారానికి వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంటు (Parliament) వర్షాకాల సమావేశాలు ఇవాళ మరోసారి వాయిదా పడ్డాయి. ఈ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి విపక్షాల నిరసనలతో ఉభయ సభలు స్తంభిస్తూనే ఉన్నాయి. శుక్రవారం కూడా ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. బిహార్‌ ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)పై ప్రతిపక్షాలు ప్రతిరోజూ ఆందోళన చేస్తుండటంతో సభలు వరుసగా వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ ఓం బీర్లా తన ఛాంబర్‌లో అఖిలపక్ష సమావేశం (All Party Meeting) నిర్వహించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్‌ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా సభ్యులంతా సహకరించాలని స్పీకర్‌ కోరారు.

ఈ సందర్భంగా కేంద్రం, ప్రతిపక్ష నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో సోమవారం నుంచి లోక్‌సభ కార్యకలాపాలు సజావుగా జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా, సోమవారం (జులై 28) ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)పై చర్చ జరిపేందుకు కేంద్రం అంగీకరించింది. దీనిపై ప్రతిపక్షాలు లేవనెత్తిన కొన్ని డిమాండ్లపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. విపక్షాల డిమాండ్‌ మేరకు ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చకు ఒక్కో సభలో మొత్తంగా 16 గంటల సమయం కేటాయించారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ తిరిగొచ్చిన తర్వాత.. 28న దిగువ సభలో, మరుసటిరోజు ఎగువసభలో చర్చ ప్రారంభం కానుంది.

Next Story