బూత్‌ల వారీగా పోలింగ్ డేటా ఎక్కడ?

by Ajay Maddhiboyina |

ప్రతీ నియోజకవర్గంలోని ఒక్కో పోలింగ్ బూత్‌లో ఎంత మేర పోలింగ్ జరిగిందనే విషయాన్ని 17సీలో పొందుపరుస్తారు.

బూత్‌ల వారీగా పోలింగ్ డేటా ఎక్కడ?
X

- ఈసీ ఇంకా అప్‌లోడ్ చేయలేదు

- ఎన్నికల పారదర్శకత కోసం మేమే అప్‌లోడ్ చేశాం

- ఈసీపై కేజ్రివాల్ మండిపాటు

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు రావడానికి ఒక రోజు ముందు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ)పై ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రివాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ పరిధిలోని ఒక్కో అసెంబ్లీలో ఎంత మేర ఓటింగ్ నమోదయ్యిందన్న విషయాలు స్పష్టం చేసే ఫామ్ 17సీను అప్‌లోడ్ చేయమని ఎన్నికల కమిషన్‌ను కోరినా నిరాకరించిందని కేజ్రివాల్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం 'ఎక్స్' వేదికగా ఈసీఐపై మండిపడ్డారు. ప్రతీ నియోజకవర్గంలోని ఒక్కో పోలింగ్ బూత్‌లో ఎంత మేర పోలింగ్ జరిగిందనే విషయాన్ని 17సీలో పొందుపరుస్తారు. పోలింగ్ ముగిసన వెంటనే ఈసీ దాన్ని విధిగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. మేం ఎన్నిసార్లు కోరినా అప్‌లోడ్ చేయడానికి నిరాకరించింది. అందుకే ఎన్నికల్లో పారదర్శకత కోసం తామే ఒక వెబ్‌సైట్ రూపొందించి, దానిలో అప్‌లోడ్ చేసినట్లు అర్వింద్ కేజ్రివాల్ పేర్కొన్నారు. 17సీలో ఏ బూత్‌లో ఎన్ని ఓట్లు పోలయ్యాయనే విషయాలను రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లతో ధృవీకరించుకొని, ప్రిసైడింగ్ ఆఫీసర్‌తో కలిసి సంతకాలు చేస్తారు. 17సీలో పేర్కొన్న ఓట్లే ఆ బూత్‌లో ఫైనల్‌గా పోలైన ఓట్లుగా పేర్కొని, ఆ తర్వాత ఈవీఎంలను ఆఫ్ చేస్తారు. కౌంటింగ్ రోజు ఈ 17సీ ఫామ్‌లతో ఈవీఎంల ఓట్లను టాలీ చేస్తారు. రెండింటికీ తేడా ఉంటే సదరు ఈవీఎంను పక్కన పెడతారు. అయితే ఈ 17సీ డాక్యుమెంట్‌ను ఈసీ అప్‌లోడ్ చేయడం లేదని కేజ్రివాల్ మండిపడుతున్నారు. ఎన్నికల్లో పారదర్శకత కోసం మేం ప్రతీ బూత్ వివరాలను పట్టిక రూపంలో వెబ్‌సైట్‌లో పెట్టామని చెప్పారు. ఈసీ చేయాల్సిన పనిని తామే చేశామని కేజ్రివాల్ మండిపడ్డారు.

Next Story