ఎన్నికల్లో ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్‌లతో బీజేపీ ప్రచార వ్యూహం

by Dishanational1 |
ఎన్నికల్లో ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్‌లతో బీజేపీ ప్రచార వ్యూహం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సోషల్ మీడియా సహా వివిధ ప్లాట్‌ఫామ్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఈసారి ఎన్నికలకు ప్రధానంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లతో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. మ్యూజిక్ నుంచి దేశ సంస్కృతి, ఫిట్‌నెస్, ఫ్యాషన్ వరకు వివిధ రంగాల్లో అత్యంత ప్రభావితం చేయగల సోషల్ మీడియా స్టార్స్‌ను బీజేపీ తన ప్రచారానికి వాడుకుంటోంది. 'ప్రస్తుతం చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రభుత్వంతో కలిసి వీడియోలను రూపొందిస్తున్నారని జానపద గాయని మైథిలీ ఠాకూర్ అన్నారు. మైథిలీ ఠాకూర్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం మొదటిసారి అందించిన అత్యంత ప్రభావవంతమైన సోషల్ మీడియా స్టార్స్ అవార్డు అందుకున్న వారిలో ఒకరు. ఆమెకు ఫేస్‌బుక్‌లో 1.4 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో 45 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. మైథిలీ ఠాకూర్ సోషల్ మీడియాలో తన హిందూ భక్తి పాట్ల ద్వారా లక్షల మంది ఫాలోవర్లను సాధించింది. కానీ, ప్రధాని మోడీ సహకారం అందించడం ద్వారా ఆమె మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.

అయితే, ప్రభుత్వం, ప్రధాన సోషల్ మీడియా స్టార్ల మధ్య సన్నీత సంబంధాలపై డిజిటల్ హక్కుల సంస్థ ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్‌కు చెందిన ప్రతీక్ వాఘ్రే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'ఈ సహకారం స్వభావం గురించి ఆందోళనగా ఉంది. ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ పోస్టుల ద్వారా డబ్బు సంపాదించాలని, కొత్త ఫాలోవర్లను పొందాలని భావిస్తున్నారు. కానీ, ఈ ధోరణి కారణంగా వారు పార్టీలకు సానుకూలంగా లేదా కనీసం విమర్శ చేయలేని పరిస్థితుల్లోకి నెట్టేస్తుందని ' వాఘ్రే అన్నారు. ఇది ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ సొంత రాజకీయ విశ్వాసాలతో సంబంధం లేకుండా పార్టీ మద్దతు ఇచ్చేలా ప్రభావితం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, దేశంలోని జనాభాలో సగానికి పైగా 30 ఏళ్లలోపు వారు సోషల్ మీడియాను వాడతారు. ఈ తరహా వ్యూహం ద్వారా యువ ఓటర్లు ప్రభావితం అవుతారు. మైథిలీ ఠాకూర్ లాంటి వారు సూటిగా ఒక పార్టీని ఎన్నుకోవాలని చెప్పకుండా, ప్రజలను ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించేలా ప్రోత్సహిస్తున్నారు. కానీ, మరికొంతమంది ప్రత్యక్షంగా ఓటు వేసేలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తునారు. నేషనల్ ఫిట్‌నెస్ సృష్టికర్త అవార్డు గ్రహీత, మాజీ రెజ్లర్ అంకిత్ తన ఫాలోవర్లను నేరుగా బీజేపీకే ఓటు వేయాలని కోరుతున్నారు. అతనికి 80 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

Next Story

Most Viewed