రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల జాబితా రిలీజ్.. ఏ రాష్ట్రం నుంచి ఎవరంటే?

by Kema Shiva Kumar |

2026 రాజ్యసభ ఎన్నికలకు 11 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది.

రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల జాబితా రిలీజ్.. ఏ రాష్ట్రం నుంచి ఎవరంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ ఎన్నికలు, ఒడిశా ఉపఎన్నికకు (Odisha Bypoll) సంబంధించి భారతీయ జనతా పార్టీ (BJP) తమ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. పార్లమెంట్ ఎగువ సభలో (Upper House) తమ బలాన్ని మరింత పెంచుకోవాలనే వ్యూహంతో బీజేపీ అధిష్టానం పలువురు సీనియర్ నేతలకు, ప్రాంతీయ ప్రతినిధులకు ఈ జాబితాలో అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా మొత్తం 11 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ విడుదల చేసింది.

కీలక నేతలకు రాజ్యసభ టికెట్లు..

పంజాబ్‌కు చెందిన సీనియర్ బీజేపీ నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌ను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలోకి దించింది. ఆయనతో పాటు రజనీష్ అగర్వాల్‌కు కూడా బీజేపీ అవకాశం కల్పించారు. ఇక రాజస్థాన్ మాజీ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ సతీష్ పూనియాను రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆయనతో పాటు డాక్టర్ అల్కా గుర్జర్‌కు కూడా రాజస్థాన్ స్థానం నుంచి టికెట్ దక్కింది. ఇక అరుణాచల్ ప్రదేశ్ నుంచి తాయి తాగాక్, మణిపూర్ నుంచి ఎ.శారదా దేవిలను తమ అభ్యర్థులుగా బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి రాజుభాయ్ శుక్లా, ముఖేష్ భాయ్ రాత్వా, మాన్‌సింగ్ పర్మార్, జితేంద్ర మేఘ్‌జీభాయ్ కాంజారియాలను బరిలోకి దించారు.

ఒడిశా ఉపఎన్నిక అభ్యర్థిగా మాజీ బీజేడీ నేత..

ఒడిశా రాజ్యసభ ఉపఎన్నిక కోసం దేబాశిష్ సమంతరాయ్‌ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడం ప్రధాన్యతను సంతరించుకుంది. ఆయన గతంలో బిజూ జనతా దళ్ (BJD)లో ఉండేవారు. ఇటీవల మే 25న ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన, వెంటనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆయనకు బీజేపీ రాజ్యసభ ఉపఎన్నిక టికెట్ కేటాయించింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 24 స్థానాలకు జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా. వాటితో పాటు మహారాష్ట్ర, తమిళనాడులలోని రెండు కీలక స్థానాలకు కూడా అదే రోజున ఉప ఎన్నికలు జరగనున్నాయి.

Next Story