ఒపీనియన్ పోల్‌ రిజల్ట్ : 399 సీట్లు ఎన్డీయేకే.. ఏపీ, తెలంగాణలో ఇలా..

by Dishanational4 |
ఒపీనియన్ పోల్‌ రిజల్ట్ : 399 సీట్లు ఎన్డీయేకే..  ఏపీ, తెలంగాణలో ఇలా..
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘ఇండియా టీవీ - సీఎన్ఎక్స్’ ఒపీనియన్ పోల్‌లో సంచలన ఫలితాలు వచ్చాయి. ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే మొత్తం 543 లోక్‌సభ స్థానాలకుగానూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 399 సీట్లు గెలుస్తుందని ఈ సర్వేలో వెల్లడైంది. వీటిలో అత్యధికంగా 342 సీట్లు ఒక్క బీజేపీకే వస్తాయని ఒపీనియన్ పోల్‌ చెప్పింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి (తృణమూల్ కాంగ్రెస్ మినహా) 94 సీట్లు గెలుస్తుందని వెల్లడైంది. ఇక బలమైన ప్రాంతీయ పార్టీల జాబితాలోని తృణమూల్ కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, బీజేడీ, స్వతంత్రులు కలిసి మిగితా 50 సీట్లను గెల్చుకునే ఛాన్స్ ఉందని సర్వే తేల్చింది. పార్టీల వారీగా.. బీజేపీకి 342, కాంగ్రెస్‌కు 38, తృణమూల్ కాంగ్రెస్‌కు 19, డీఎంకేకు 18, జేడీయూకు 14, టీడీపీకి 12, ఆమ్ ఆద్మీ పార్టీకి 6, సమాజ్ వాదీ పార్టీకి 3, ఇతరులకు 91 సీట్లు రావొచ్చని పేర్కొంది.

యూపీలో 80కి 73 బీజేపీకే..

మార్చి 1 నుంచి 30 మధ్య కాలంలో దేశంలోని మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో 1,79,190 మంది నుంచి అభిప్రాయ సేకరణ చేశామని ‘ఇండియా టీవీ - సీఎన్ఎక్స్’ సర్వే నిర్వాహకులు వెల్లడించారు. వీరిలో 91,100 మంది పురుషులు, 88,090 మంది మహిళలు ఉన్నారు. బీజేపీకి ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 73 సీట్లు వస్తాయని ఒపీనియన్ పోల్ పేర్కొంది. యూపీలోని ఎన్డీయే కూటమిలో భాగస్వాములుగా ఉన్న రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్‌డీ), అప్నాదళ్ (ఎస్) పార్టీలకు చెరో రెండు సీట్లు దక్కొచ్చని తెలిపింది. ఈ రాష్ట్రంలో మిగిలిన మూడు లోక్‌సభ స్థానాలు సమాజ్‌వాదీ పార్టీకి దక్కుతాయని సర్వే తేల్చింది. ఈసారి కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లకు ఒక్క సీటు కూడా రాకపోవచ్చని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఇక బీజేపీకి మధ్యప్రదేశ్‌లో 29 సీట్లు, గుజరాత్‌లో 26 సీట్లు, రాజస్థాన్‌లో 25 సీట్లు, హర్యానాలో 10 సీట్లు, ఢిల్లీలో ఏడు సీట్లు, ఉత్తరాఖండ్‌లో 5 సీట్లు, ఉత్తరాఖండ్‌లో 5 సీట్లు, హిమాచల్ ప్రదేశ్‌లో 4 సీట్లు వస్తాయని సర్వేలో గుర్తించారు. బిహార్‌‌లో 17, జార్ఖండ్‌లో 12, కర్ణాటకలో 22, మహారాష్ట్రలో 27, ఒడిశాలో 10, అసోంలో 11, పశ్చిమ బెంగాల్‌లో 22 లోక్‌సభ సీట్లను బీజేపీ గెలవబోతోందని అంచనా వేశారు.

ఏపీ, తెలంగాణలలో..

ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే.. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ 19 సీట్లు, తమిళనాడులో డీఎంకే 18, వైఎస్సార్‌సీపీ 10, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ 12, బీజేపీ 3, ఒడిశాలో బిజూ జనతాదళ్ 11 సీట్లను గెలుచుకుంటుందని ఒపీనియన్ పోల్ తెలిపింది. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్ 9, బీజేపీ 5, బీఆర్ఎస్ 2, మజ్లిస్ పార్టీ 1 స్థానం గెలవొచ్చని అంచనా వేసింది.

Next Story

Most Viewed