పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీలకు త్రీ-లైన్ విప్ జారీ

by Malleboina Mahesh |

బీజేపీ ఎంపీలకు త్రీ-లైన్ విప్ జారీ! ఏప్రిల్ 16-18 వరకు పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై కీలక చర్చ జరిగే అవకాశం.

పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీలకు త్రీ-లైన్ విప్ జారీ
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Budget sessions of Parliament) కీలక దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అధికార భారతీయ జనతా పార్టీ (BJP) తమ ఎంపీలకు అత్యంత కఠినమైన ‘త్రీ-లైన్ విప్’ (‘Three-line whip’) జారీ చేసింది. ఏప్రిల్ 16 నుండి 18 వరకు లోక్‌సభ, రాజ్యసభలోని బీజేపీ ఎంపీలందరూ తప్పనిసరిగా సభలో ఉండాలని పార్టీ ఆదేశించింది. ప్రభుత్వం కొన్ని కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకునే అవకాశం ఉన్నందున, సభ్యులందరూ సభకు హాజరై ప్రభుత్వానికి మద్దతు తెలపాలని పార్టీ చీఫ్ విప్ స్పష్టం చేశారు. ఈ మూడు రోజులు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉత్కంఠ..

ఈసారి సమావేశాల్లో అందరి దృష్టి ప్రధానంగా మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill) అమలు, దాని తదుపరి పరిణామాలపైనే ఉంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం కోటాను కల్పించే ఈ చారిత్రాత్మక బిల్లుకు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన (Delimitation), జనాభా గణన ప్రక్రియపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. అయితే, ఈ బిల్లును సజావుగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా మహిళా సాధికారత దిశగా తమ నిబద్ధతను చాటుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ తన ఎంపీలను అప్రమత్తం చేయడం, పార్లమెంట్‌లో మౌలిక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారనే సంకేతాలను ఇస్తున్నట్లు తెలుస్తుంది.

Next Story