బీజేపీ ప్లాన్ బీ అమలు చేస్తోంది: కాంగ్రెస్ విమర్శలు

by Dishanational2 |
బీజేపీ ప్లాన్ బీ అమలు చేస్తోంది: కాంగ్రెస్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ బెడిసి కొట్టడంతో నిధుల కోసం బీజేపీ ప్లాన్ బీ అమలు చేస్తున్నదని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా విమర్శించారు. బీజేపీకి నేరుగా విరాళాలు ఇస్తున్న వ్యక్తులను పార్టీలో చేర్చుకుంటుందని ఆరోపించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల బీజేపీలో చేరిన మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డిని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. అనేక సీబీఐ కేసులను ఎదుర్కొంటున్న జనార్ధన్ రెడ్డిని బీజేపీలో ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘జనార్ధన్ రెడ్డి బీజేపీలో చేరారు కాబట్టి అతనికి సీబీఐ త్వరలోనే క్లీన్ చీట్ ఇస్తుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు బీజేపీ, మోడీతో కలిసి వస్తే నిర్దోషులవుతున్నారు. ఇది ప్రతి వారం క్రమంగా జరుగుతోంది. ఎలక్టోరల్ బాండ్ స్కీమును సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ప్లాబ్ బీ అమలు చేస్తున్నారు. గతంలో డబ్బులు ఇచ్చిన వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

పశ్చిమ బెంగాల్, కర్ణాటక లేదా ఇతర రాష్ట్రాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు బీజేపీ రక్షణ కల్పిస్తోందని మండిపడ్డారు. లోకాయుక్త నివేదికతో పాటు తగిన ఆధారాలు ఉన్నా, అలాంటి వ్యక్తులను పార్టీలోకి ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. కాగా, మైనింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్ రెడ్డి గతేడాది కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి రాజీనామా చేసి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష అనే పార్టీని స్థాపించారు. తాజాగా మరోసారి బీజేపీలో చేరారు. అయితే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గాలి జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు పలకడం గమనార్హం.


Next Story

Most Viewed