పార్లమెంటు ఎదుటకు ‘పేపర్ లీక్స్’ బిల్లు.. కీలక ప్రతిపాదనలివీ

by Dishanational4 |
పార్లమెంటు ఎదుటకు ‘పేపర్ లీక్స్’ బిల్లు.. కీలక ప్రతిపాదనలివీ
X

దిశ, నేషనల్ బ్యూరో : విద్యార్హతల పరీక్షలు, ఉద్యోగ పరీక్షల్లో పేపర్ లీకేజీ వ్యవహారాలు దేశంలో నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో యూపీఎస్సీ, ఎస్ఎస్‌సీ, రైల్వేస్, నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలలో పేపర్ లీక్‌లను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తెచ్చే దిశగా కేంద్ర సర్కారు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ‘పబ్లిక్ ఎగ్జామినేషన్ (అక్రమ మార్గాల నివారణ) బిల్లు-2024’ను సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదంతో చట్టరూపాన్ని దాలిస్తే.. పేపర్ లీక్ కేసుల్లో దోషులుగా తేలే వారికి కనీసం మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే పేపర్ లీక్ వ్యవహారాల్లో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారికి ఐదు నుంచి పదేళ్ల జైలుశిక్ష విధించాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.

ఇతర ప్రతిపాదనలు ఇవీ..

* పరీక్షల నిర్వహణ బాధ్యతలను చేపట్టే సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు పేపర్ లీక్ చేసినట్లు తేలితే వాటికి రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునంతా సంస్థ నుంచి రికవర్ చేయాలనే ప్రతిపాదనను కూడా ఈ బిల్లులో పొందుపరిచారు. ఇలాంటి సంస్థపై పరీక్షలు నిర్వహించకుండా నాలుగేళ్ల పాటు బ్యాన్‌ను కూడా విధించాలని ప్రపోజ్ చేశారు.

* పేపర్ లీక్ కేసుల విచారణను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి కంటే తక్కువ లేని అధికారి నిర్వహించాల్సి ఉంటుంది. దర్యాప్తును ఏదైనా కేంద్ర ఏజెన్సీకి అప్పగించే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.

* స్థూలంగా ఈ బిల్లులో పేపర్ లీక్‌తో ముడిపడిన 20 రకాల నేరాలు, అక్రమాలకు పాల్పడే వారికి విధించాల్సిన శిక్షల గురించి ప్రస్తావించారు. మాస్ కాపీయింగ్, జవాబు పత్రాలను తారుమారు చేయడం, ఓఎంఆర్ షీట్లను ట్యాంపరింగ్ చేయడం వంటివన్నీ ఈ నేరాల జాబితాలో ఉన్నాయి.

Next Story

Most Viewed