పేపర్ లీకులపై మోడీ బ్రహ్మాస్త్రం.. నేడు పార్లమెంటులో బిల్లు

by Dishanational4 |
పేపర్ లీకులపై మోడీ బ్రహ్మాస్త్రం.. నేడు పార్లమెంటులో బిల్లు
X

దిశ, నేషనల్ బ్యూరో : మన దేశంలో ఏటా చాలాచోట్ల ఉద్యోగ పరీక్షలు, విద్యార్హతల పరీక్షల్లో పేపర్ లీకేజీ బాగోతాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఎన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేసినా ఏదో ఒక లోపాన్ని వాడుకొని కొందరు అక్రమార్కులు పేపర్ లీకేజీలకు పాల్పడుతుంటారు. దీన్నివల్ల విద్యార్థులు, ఉద్యోగార్థుల జీవితాలు ప్రశ్నార్ధకంగా, అగమ్య గోచరంగా మారుతున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు.. పేపర్ లీకేజీల సమస్యను పరిష్కరించేందుకుగానూ కేంద్ర సర్కారు సోమవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనుంది. దానిపేరు ‘ పబ్లిక్ ఎగ్జామినేషన్ (అన్యాయమైన మార్గాల నివారణ) బిల్లు’. ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షలు, విశ్వవిద్యాలయాల పరీక్షలు సహా వివిధ ఎగ్జామ్‌లలోని అన్యాయమైన పద్ధతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించనుంది. ఈ తరహా కేసుల్లో దోషులుగా తేలిన వారికి రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు జరిమానాతో పాటు పదేళ్ల జైలుశిక్షను ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదిత చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఉన్నత స్థాయి జాతీయ సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. గతేడాది ప్రశ్నపత్రం లీకవడంతో రద్దయిన పరీక్షల్లో రాజస్థాన్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష, హర్యానాలో గ్రూప్-డీ పోస్టులకు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ), గుజరాత్‌లో జూనియర్ క్లర్క్‌ల రిక్రూట్‌మెంట్ పరీక్ష, బిహార్‌లో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఉన్నాయి.

Next Story

Most Viewed