బిహార్ తొలి విడత అసెంబ్లీ పోలింగ్ ప్రారంభం.. బరిలో 1,314 మంది అభ్యర్థులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-06 03:08:02  IST  )

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ ఇవాళ ఉదయం సరిగ్గా 7 గంటలకు ప్రారంభమైంది.

బిహార్ తొలి విడత అసెంబ్లీ పోలింగ్ ప్రారంభం.. బరిలో 1,314 మంది అభ్యర్థులు
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ ఇవాళ ఉదయం సరిగ్గా 7 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 6:30కి ఆయా పార్టీ ఏజెంట్ల ఎదుట ప్రారంభమైన మాక్ పోలింగ్ కాసేపటి క్రితం ముగిసింది. 243 స్థానాల్లో 121 స్థానాలకు చెందిన 18 జిల్లాల్లో తొలి దశ పోలింగ్‌ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే, 5 గంటల తర్వాత క్యూలో ఉన్న ఓటర్లకు కూడా ఓటు వేసే అవకాశం కల్పించనున్నట్లుగా ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. తొలి దశ పోలింగ్‌లో భాగంగా 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని 1,314 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. ఇందు కోసం ఎన్నికల అధికారులు 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక రెండో దశ ఎన్నికలు నవంబర్ 11న జరుగనుండగా.. నవంబర్ 14న కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి విజేతలను ప్రకటిస్తారు.

ఈ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని ఎన్‌డీఏ (బీజేపీ, జేడీయూ), మహాగఠ్‌బంధన్ (ఆర్‌జేడీ, కాంగ్రెస్) ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగింది. తొలి విడత ఎన్నికల్లో బరిలో ప్రధాన అభ్యర్థులలో మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్థి, ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ (రఘోపూర్), డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి (బీజేపీ), మాంగల్ పాండే (సీవాన్) ఉన్నారు. మైథిలీ ఠాకూర్ వంటి ప్రముఖులు కూడా పోటీ పడుతున్నారు. ఎన్నికల కమిషన్ భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తోంది. ఓటర్లు ఈపీఐసీ వెబ్‌సైట్ లేదా వోటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా తమ పోలింగ్ బూత్ వివరాలు తనిఖీ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

Next Story