'యూపీలోనూ కులగణన చేపట్టాలి'.. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ డిమాండ్

by Disha Web Desk 13 |
యూపీలోనూ కులగణన చేపట్టాలి.. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ డిమాండ్
X

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోనూ కులగణన చేపట్టాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ), బహుజన్ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ), కాంగ్రెస్‌ డిమాండ్ చేశాయి. బిహార్‌లో కుల గణన ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. యూపీ ప్రభుత్వం వెంటనే కులాల సర్వే నిర్వహించాలని కోరారు. కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)కి న్యాయం జరిగేలా చూడాలంటే ఇదొక్కటే మార్గమని అన్నారు. ఎస్‌పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బీజేపీ మిత్రపక్షం అప్నా దళ్ (సోనేలాల్)‌తో పాటు కాంగ్రెస్ కూడా యూపీ, ఇతర ప్రాంతాల్లో వివిధ కులాల సంఖ్యను గుర్తించడానికి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

అయితే రాష్ట్రంలో అధికారిక బీజేపీ మాత్రం ఈ అంశంపై వ్యాఖ్యానించలేదు. ఈ మేరకు ‘OBCల రాజ్యాంగ హక్కుల కోసం చాలా కాలంగా జరుగుతున్న పోరాటంలో ఇది మొదటి అడుగు’ అని బిహార్‌ కుల గణన డేటాను ఉద్దేశిస్తూ యూపీ మాజీ సీఎం మాయావతి ట్వీట్ చేశారు. ప్రజల సెంటిమెంట్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కుల గణన లేదా సర్వే ప్రారంభించాలని అన్నారు.



Next Story

Most Viewed