సుప్రీం కోర్టులో షిండే వర్గానికి బిగ్ షాక్!

by Disha Web Desk 4 |
సుప్రీం కోర్టులో షిండే వర్గానికి బిగ్ షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గోగావాలేను విప్ గా నియమించడం చెల్లదని స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఉద్దవ్ థాక్రే వర్గం, షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏక్ నాథ్ షిండే సీఎంగా కొనసాగేందుకు సమ్మతిస్తూనే ఆయన పక్ష నిర్ణయాలను తప్పుబట్టింది. గత ఏడాది జూన్‌లో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసినందుకు షిండేతో పాటు మరో 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.

థాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలనే అభ్యర్థనను ఈ సందర్భంగా ధర్మాసనం తిరస్కరించింది. అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవడానికి బదులుగా థాక్రే రాజీనామా చేశారని ఆయన రాజీనామా చేయకుండా పోరాడితే నేడు ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చేదని పేర్కొంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. థాక్రే ప్రభుత్వం మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయారని నిర్ధారించడంలో అప్పటి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ నిర్ణయాన్ని కోర్టు ఖండించింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.

Next Story